ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు

– ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ సదస్సులో ప్రసంగించనున్న కేటీఆర్‌
– అమెరికాకు పయనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రపంచ వేదికపైన తెలంగాణ సాధించిన జలవిజయాన్ని చాటేందుకు మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సీఎం కేసీఆర్‌ మార్గదర్శనంలో నిర్మాణమైన ప్రపంచం లోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణం, ఇంటింటికి సురక్షిత తాగునీటిని అందిస్తున్న మిషన్‌ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ఫలితాలను అమెరికాలోని నెవడా రాష్ట్రంలోని హెండర్సన్‌ నగరంలో జరుగుతున్న అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌-వరల్డ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ కాంగ్రెస్‌ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసేందుకు ఆ సంస్థ ఆహ్వానం మేరకు మంత్రి కేటీఆర్‌ అమెరికాకు వెళ్లారు.
సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రణాళికల గురించి 2017లో అమెరికా శాక్రమెంటో వేదికగా జరిగిన ఏఎస్‌సీఈ సదస్సులో మంత్రి కేటీఆర్‌ వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భారీ సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళికలు, అందరికి సురక్షిత తాగునీటినందించే మిషన్‌ భగీరథ లాంటి బహత్‌ పథకాల గురించి ఆ రోజు కేటీఆర్‌ వివరించినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఏఎస్‌సీఈ, ఆ తర్వాత 2022లో తెలంగాణలో పర్యటించింది. కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రత్యేకంగా సందర్శించిన ఆ సంస్థ ప్రతినిధుల బందం, తెలంగాణ సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ గేమ్‌ ఛేంజర్‌ అని ప్రశంసించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును స్వల్ప కాలంలోనే పూర్తి చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన అమెరికన్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ సొసైటీ ఆ విజయగాథను, తెలంగాణ ప్రభుత్వ ఘనతను అమెరికాలో వివరించేందుకు రావాలని ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపించింది.
అమెరికాలోని అన్ని ప్రాంతాల నుంచి హాజరయ్యే సివిల్‌ ఇంజనీర్ల సమక్షంలో మంత్రి కేటీఆర్‌, సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు, దాని ద్వారా అందుతున్న ఫలాలు, ఇతర ప్రణాళికలను ఒక ప్రజెంటేషన్‌ రూపంలో అందించనున్నారు. కాళేశ్వరంతోపాటు మిషన్‌ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి తాగునీటిని అందించిన విధానం, ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన సామాజిక ఆర్థిక ప్రగతిని మంత్రి కేటీఆర్‌ వివరించనున్నారు. కేసీఆర్‌ ఆధ్వర్యంలో సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రపంచానికి వివరించే అవకాశం దక్కడం పట్ల కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణ, ఇవాళ పచ్చని పంటలతో కళకళలాడడానికి కేసీఆర్‌ ఈ నేలపై ఉన్న మమకారం, అపార జ్ఞానం, ముందుచూపే కారణమని కేటీఆర్‌ చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా ఐదు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పలు కంపెనీలతో మంత్రి కేటీఆర్‌ సమావేశం కానున్నారు. ఈ నెల చివరి వారం వరకు కొనసాగే ఈ పర్యటనలో పలు అమెరికన్‌ కంపెనీలు తమ పెట్టుబడి ప్రకటనలను చేసే అవకాశం ఉన్నది.

Spread the love