నవతెలంగాణ హైదరాబాద్: వైద్యురాలు కావాలనుకున్న తన చిన్ననాటి కలను సాకారం చేసుకుంది. తనకు ఇష్టమైన విభాగంలో పీజీ చేసి ఉన్నత స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇంతలోనే విధి ఆమెను చిన్నచూపు చూసింది. స్నేహితులతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు ట్రెక్కింగ్కు వెళ్లిన తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తు మృతిచెందిన సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల(23) ఆస్ట్రేలియా గోల్డ్కోస్ట్లోని బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఈనెల 2వ తేదీ సరదాగా తోటి స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లిన ఉజ్వల ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో ఆమె మరణించడం తల్లిదండ్రులు, బంధువులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులైన వేమూరు మైథిలి, వెంకటేశ్వరరావు కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. శనివారం అంత్యక్రియల నిమిత్తం భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్య (మూల్పూరు రమేష్)ల ఇంటికి తీసుకొస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.