అమెరికాలో తెలుగు విద్యార్థులు మృతి

నవతెలంగాణ వనపర్తి: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ఒకే గదిలో శనివారం రాత్రి మృతి చెందారు. వీరిలో ఒకరు వనపర్తికి చెందిన విద్యార్థి దినేశ్ కాగా.. మరొకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారని తెలిసింది. వనపర్తి పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల ఏకైక కుమారుడు దినేశ్(23) బీటెక్ పూర్తి చేసి అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం ఫెయిర్ ఫీల్డ్లోని సేక్రెడ్ హార్ట్ విశ్వవిద్యాలయం(ఎస్ హెచ్ఐయూ)లో ఎంఎస్ చేసేందుకు గత ఏడాది డిసెంబరు 28న పయనమయ్యారు.  దినేశ్ వెళ్లిన 17 రోజులకే నిద్రలోనే చనిపోయినట్టు సమాచారం రావడంతో ఆ తల్లిదండ్రులు దానిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇతనితో పాటు శ్రీకాకుళం జిల్లా విద్యార్థి కూడా చనిపోయాడని తెలిసిందన్నారు. ఒకే గదిలో ఉన్న ఇద్దరు విద్యార్థులు నిద్రలోనే విగతజీవులుగా మారడంపై పలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషవాయువు పీల్చడంతో చనిపోయి ఉండొచ్చని అక్కడి నుంచి సమాచారం వచ్చినట్టు వారు తెలిపారు. విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా మృతదేహాన్ని వనపర్తికి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Spread the love