Monday, May 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంతుపాను ముందు ప్రశాంతత

తుపాను ముందు ప్రశాంతత

- Advertisement -

ట్రంప్ హెచ్చరిక నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు
మరోసారి సైనిక ఘర్షణ తప్పదని గల్ఫ్‌లో భయాందోళనలు
ఇంధన భద్రతకు ముప్పులో
ప్రపంచ మార్కెట్లలో
అస్థిరత తప్పదన్న సంకేతాలు

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ అస్పష్టమైన హెచ్చరికను చూస్తుంటే ఇరాన్‌తో సైనిక ఘర్షణలు పెరిగే అవకాశం ఉందన్న భయాందోళనలు కలుగుతున్నాయి. ట్రంప్ హెచ్చరిక గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఇరాన్‌తో జరగబోయే ఘర్షణను సూచిస్తున్న విధంగా ఉన్న ఓ చిత్రంతో పాటు ‘ఇది తుపాను కు ముందు ప్రశాంతత’ అంటూ ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో సంచలనాత్మక సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఆందోళనకు ఈ పోస్టే కారణమవుతోంది. ఇంతకీ ట్రంప్ పోస్ట్ చేసిన ఆ చిత్రంలో ఏముంది? అల్లకల్లోలంలా కన్పిస్తున్న సముద్రం… మెరుపులు, ఉరుములు… నౌకాదళానికి చెందిన ఓ నావలో అమెరికా నేవీ అడ్మిరల్ పక్కనే ట్రంప్… ఆయన తలపై మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని రాసి ఉన్న టోపీ…. ఆ చిత్రం నేపథ్యంలో ఇరాన్ నౌకలు… దీనిని చూస్తుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ‘తుపాను ముందు ప్రశాంతత’ అనే హెచ్చరిక ఇరాన్‌ను ఉద్దేశించి చేసిందేనని స్పష్టమవుతోంది కదా.

విమర్శలకు పదును పెట్టిన ట్రంప్
దౌత్యపరమైన సంప్రదింపులు విఫలమైతే ఇరాన్‌పై తిరిగి వైమానిక దాడులు ప్రారంభిస్తామని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య చర్చలు నిలిచిపోవడంతో ఇరాన్ విషయంలో ఏం చేయాలనే దానిపై ట్రంప్ సహాయకులు వ్యూహరచన చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మధ్యప్రాచ్యంలో సైనిక మోహరింపులు, హార్ముజ్ జలసంధిలో ఘర్షణలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని నీరుకార్చాయి. ఈ పరిస్థితులలో ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యకు ట్రంప్ ప్రభుత్వం సన్నద్ధమవుతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇరాన్‌పై చేస్తున్న విమర్శలను ట్రంప్ ఇటీవలి కాలంలో మరింత తీవ్రతరం చేశారు. అవ గాహన కుదుర్చుకోవడంలో టెహ్రాన్ విఫలమైతే అత్యంత క్లిష్టమై న సమయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. చర్చ లకు ఇరాన్ సుముఖంగా ఉన్నదని అంటూనే ఆయన ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.


స్పష్టమైన హామీలు లేకుండా ఒప్పందం ఎలా : ఇరాన్
వాషింగ్టన్ వైఖరి కఠినంగా ఉన్నప్పటికీ చర్చలకు సుముఖమే అని ఇరాన్ అధికారులు సంకేతాలు పంపుతున్నారు. ఇరాన్‌తో తిరిగి చర్చలు ప్రారంభించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నదని సూచించే సంకేతాలు అందాయని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. అయితే సంవత్సరాల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఆంక్షలు, సైనిక బెదిరింపుల కార ణంగా అమెరికా వైఖరిపై తమకు అపనమ్మకం కలుగుతోందని ఆయన చెప్పారు. అమెరికా నుంచి స్పష్టమైన హామీలు పొంద కుండా ఎలా ఒప్పందం కుదుర్చుకుంటామని ఇరాన్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఒప్పందం విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని వారు భావిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో మరోసారి ఘర్షణలు తలెత్తితే ఇంధన భద్రత, ప్రపంచ మార్కెట్లు అస్థిరపడతాయన్న ఆందోళన గల్ఫ్ దేశాలలో వ్యక్యమవుతోంది.

ప్రపంచంపై హార్ముజ్ అస్థిరత ప్రభావం
హార్ముజ్ జలసంధి పరిసరాలలో నెలకొన్న పరిస్థితి ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు ఈ ఇరుకైన దారి మీదుగానే జరుగుతుండడంతో అక్కడ ఏ మాత్రం అస్థిరత ఏర్పడినా దాని ప్రభావం ప్రపంచ దేశాలన్నింటి పైన పడుతుంది. గత నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఘర్షణలను తాత్కాలికంగా తగ్గించినప్పటికీ గల్ఫ్‌లోనూ, దాని పరిసరాలలోనూ సైనిక కార్యకలాపాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో అమెరికా నౌకాదళం పెద్ద ఎత్తున మోహరించి ఉంది. మరోవైపు గల్ఫ్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇరాన్ కూడా చర్యలు చేపట్టింది. హార్ముజ్ జలసంధి కోసం నౌకాయాన నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఇరాన్ నియంత్రణలోని సముద్ర మార్గాలపై ఆంక్షలు విధించాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే మధ్యప్రాచ్యం మరో ప్రమాదకరమైన ఘర్షణ వైపు పయనిస్తోందే మోనన్న భయాం దోళనలు కలుగుతున్నాయి. ఇరు పక్షాలు ఓ వైపు కఠిన వైఖరిని అవలంబిస్తూనే మరోవైపు చర్చలకు తలుపులు తెరిచి ఉన్నందున ప్రస్తుత సంక్షోభం దౌత్యం వైపు నడుస్తుందా లేక ఘర్షణకు దారితీస్తుందా అనేది ప్రశార్థకంగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -