కాంగ్రెస్ లోకి పొంగులేటి, జూపల్లి..ముహూర్తం ఖరారు

నవతెలంగాణ-హైదరాబాద్ : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 25 లేదా 26న ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ వచ్చే అవకాశం ఉంది. ఈ సభలో ఇరువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఇక నాగర్ కర్నూల్ సభలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరతారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. కాగా ఈనెల 22న రాహుల్ గాంధీని కలవనున్నారు జూపల్లి, పొంగులేటి. వీరిద్దరితోపాటు కే దామోదర్ రెడ్డి కూడా రాహుల్ గాంధీని కలవనున్నట్లు తెలుస్తోంది. దీంతో దామోదర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారనే దానిపై స్పష్టత వచ్చింది. అలాగే బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉండడం, కర్ణాటక గెలుపుతో రాష్ట్రంలో పుంజుకునే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని పొంగులేటి, జూపల్లి నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక వీరి వెంట ఖమ్మం జిల్లాలోని చాలామంది నాయకులు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

Spread the love