నవతెలంగాణ – హైదరాబాద్ : ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో రసాభాస నెలకొన్నది. ఇజ్రాయిల్ ప్రతినిధి డాన్నీ డాన్, ఐక్యరాజ్యసమితి అధికారి వన్నెసా ఫ్రేజర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. యుద్ధ క్షేత్రాల్లో పిల్లలపై లైంగిక హింస అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇజ్రాయెల్ ప్రతినిధి, యూఎన్ అధికారి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగింది. ఇద్దరూ గట్టిగా అరుచుకున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
యుద్ధ క్షేత్రాల్లో లైంగిక హింస నిర్మూన అంతర్జాతీయ దినోత్సవం నేపథ్యంలో చర్చలో పాల్గొన్న ఇజ్రయెల్ ప్రతినిధి డాన్నీ డానన్ మాట్లాడుతూ .. ప్రమీలా పాట్టెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్లో లైంగిక హింస ఘటనలు జరిగాయని, ఆ దేశాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రమీలా తన రిపోర్టులో పేర్కొన్నారు.అయితే ఆ నివేదికను ఇజ్రాయెల్ తప్పుపట్టింది. యూఎన్ సెక్రటరీ జనరల్ ఆదేశాల మేరకు ఇలాంటి నివేదికలు తయారు చేశారని డానన్ ఆరోపించారు.
ఆ సమయంలో యూఎన్ ప్రతినిధిగా మీటింగ్లో పాల్గొన్న వన్నెసా ఫ్రేజర్ ఇజ్రాయెల్ ప్రతినిధి వ్యాఖ్యలను ఖండించారు. డాన్నీ తీవ్రంగా వాదిస్తున్నా.. ఆ వ్యాఖ్యలను వన్నెసా అడ్డుకున్నారు. వ్యక్తిగత దాడులు చేయవద్దు అని ఆమె అన్నారు. ఇజ్రాయెల్లో జరుగుతున్న లైంగిక హింసాత్మక ఘటన గురించి ఆధారాలను సేకరించినట్లు ఆమె చెప్పారు. ఆ సందర్భంలో ఇజ్రాయెల్ ప్రతినిధి డానన్ గట్టిగా అరుస్తూ మాట్లాడారు. నోరు మూసుకోవాలని అన్నారు. మేం యూఎన్ సభ్య దేశ వ్యక్తులమని, మీరు కేవలం యూఎన్ కోసం వర్క్ చేస్తున్నారని, ఇప్పుడు మీరు నోరు మూసుకోవాలని, నోరు మూసుకుంటారా లేదా అని డానన్ ఆగ్రహంగా అన్నారు. పాలస్తీనియా పిల్లల పట్ల వేధింపులు జరుగుతున్నట్లు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా యూఎన్లో రిపోర్టు ప్రవేశపెట్టారు.



