ఎన్నిక‌ల్లో బెస్ట్ ఫొటో ఇదే: ఆనంద్ మ‌హీంద్రా

నవతెలంగాణ – హైదరాబాద్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్‌ మహీంద్రా తన అధికార ‘ఎక్స్’ (ట్విట‌ర్‌) ఖాతా ద్వారా మరో ఆస‌క్తిక‌ర‌ పోస్ట్‌ పెట్టారు. సోమ‌వారం ముగిసిన ఐదో ద‌శ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మొద‌టిసారి ఓటు వేసిన గిరిజ‌నుడి ఫొటోను ఆయ‌న నెటిజ‌న్ల‌తో పంచుకున్నారు. త‌న వ‌ర‌కు 2024 ఎన్నిక‌ల్లో బెస్ట్ ఫొటో ఇదేనంటూ మ‌హీంద్రా కొనియాడారు. గ్రేట్ నికోబార్ ద్వీపంలోని ద‌ట్ట‌మైన అడ‌వుల్లో నివ‌సించే షోంపెన్ తెగ‌కు చెందిన ఏడుగురిలో ఒక‌రు మొద‌టిసారి ఓటేశారు. ప్ర‌జాస్వామ్యానికి ఎదురులేదని, తిరుగులేని శ‌క్తి అని ఆనంద్ మ‌హీంద్రా రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అంత‌కుముందు నిన్న‌టి పోలింగ్‌లో త‌న‌ ఓటు హ‌క్కు వినియోగించుకున్న త‌ర్వాత కూడా ఆయ‌న ఓ ట్వీట్ చేశారు. ‘మ‌న‌ల్ని ఎవ‌రు ప‌రిపాలించాలో నిర్ణ‌యించుకునే అవ‌కాశం. ఇది ఒక బ్లెస్సింగ్’ అంటూ ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ చేశారు.

Spread the love