నేటి నుంచి కాంగ్రెస్ ముమ్మర ప్రచారం

– రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేతల విస్తృత పర్యటన

నవతెలంగాణ హైదరాబాద్: పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ కీలక నేతలంతా ప్రచారంలో బిజీ బిజీ అయ్యారు. రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రచారం చేస్తుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి,పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను పీసీసీ ప్రకటించింది. నేటి నుంచి 10వ తేదీ వరకు ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను ఆ పార్టీ వెల్లడించింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఇబ్రహీంపట్నం రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్… రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రచారం నిర్వహించనున్నారు. రేపు మేదక్, వరంగల్,  నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు కరీంనగర్ జనజాతర సభలో, సాయంత్రం 6 గంటలకు ఎల్ బీ నగర్, సరూర్ నగర్ స్టేడియంలో జరిగే జన జాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి జన జాతర సభ, సాయంత్రం 4 గంటలకు తాండూరు జన జాతర సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు షాద్ నగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో ప్రియాంక గాంధీ పాల్గొంటారని వివరించారు.

Spread the love