తెలంగాణలో ఒక్కరోజే వడదెబ్బకు 19మంది మృతి

నవతెలంగాణ హైదరాబాద్: గత వారం రోజులుగా రాష్ట్రాన్ని ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఈ ఎండలకు తాళలేక రైతులు, రోజు కూలీలు, వృద్ధులు మృత్యువాత పడుతున్నారు. శనివారం పలు జిల్లాల్లో 19 మంది మృతిచెందారు. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాలు అట్టుఉడుకుతున్నాయి. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అల్లిపూర్‌, ధర్మపురి మండలం జైన, కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో 46.7, నిజామాబాద్‌ జిల్లా జాకోరా, నారాయణపేట జిల్లా ఊట్కూరులో 46.4, నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రం, మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండల కేంద్రంలో 46.3, నల్గొండ జిల్లా బుగ్గబావిగడ్డలో 46.2 డిగ్రీల ఎండ కాసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీనికి వడగాలులు తోడు అవ్వడంతో రాష్ట్రాంలో పరిస్థితి దారుణంగా మారింది.

మృతుల వివరాలు
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం రంగాపూర్‌కు చెందిన వంక లక్ష్మి(70), భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన మేకల లస్మయ్య(56), కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం కందుగులకు చెందిన బొల్లబోయిన వనమాల(45), జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం మంగెళ గొండుగూడెంకు చెందిన కొమురం సోము(58) శనివారం పొలం పనుల్లో, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎండకు తిరిగి అస్వస్థతకు గురయ్యారు. ఇంటికి చేరిన కాసేపటికే మృతిచెందారు.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన భూమన రాములు(71), రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌ గ్రామానికి చెందిన పొన్నం సత్తయ్యగౌడ్‌(75) ఉపాధి పనులు చేస్తూ ఎండ తీవ్రతకు గురై చనిపోయారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ నాగరాజు(55) ఉదయం ఇటుకలను తరలించి మధ్యాహ్నం ఇంటికి చేరగానే కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు.
హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల కేంద్రంలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ మహమూద్‌మియా(75), షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన ఆకుల రాఘవేందర్‌(39), ములుగు పట్టణంలోని కూరగాయల మార్కెట్లో నివసిస్తున్న ఒంటరి మహిళ ఈగ ప్రమీల(69), కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌కు చెందిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి దాసరి కనుకయ్య(72), మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారానికి చెందిన గొడిశాల దేవయ్య(70) మృత్యువాత పడ్డారు.
నిజామాబాద్‌ నగరంలోని శ్రద్ధానంద్‌ గంజ్‌ రెండో గేట్‌ వద్ద గుర్తుతెలియని వ్యక్తి(40), సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం వేలూరుకు చెందిన పెయింటర్‌ ధార నాగయ్య(45), కుమురం భీం జిల్లా రెబ్బెన మండల కేంద్రానికి చెందిన కూలీ సయ్యద్‌ అజీజాబేగం(48), మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌కు చెందిన ఆవుల కనకయ్య(60), నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో కొల్లాపూర్‌ మండలం ముక్కిడిగుండంకు శక్రునాయక్‌(74) వడదెబ్బకు తాళలేక మృతిచెందారు.

 

Spread the love