కాంగ్రెస్ లో చేరిన తీన్మార్ మల్లన్న

నవతెలంగాణ హైదరాబాద్:  తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.  రాష్ట్రంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చింత పండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మానిక్ రావ్ ఠాక్రే మల్లన్నకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
గతకొంతకాలంగా మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ వార్తలు రాగా వాటిని నిజం చేస్తూ ఆ ప్రచారానికి తెరపడింది. గతంలో బీజేపీలో చేరిన మల్లన్న ఆ తరువాత ఆపార్టీకి రాజీనామా చేశారు. అంతకుముందు హుజూర్‌నగర్ ఉపఎన్నికలు, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని, మంత్రి మల్లారెడ్డిని ఓడిస్తానంటూ శపధం చేశారు. కానీ ఇప్పుడు సడన్ గా ఆయన కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ మేడ్చల్ అభ్యర్థిగా తోటకూర వజ్రేష్ యాదవ్ కు ఇప్పటికే  టికెట్ కేటాయించింది. ఈ క్రమంలో మల్లన్నకు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. మల్లన్న మాత్రం సిరిసిల్ల టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.

Spread the love