నేడే మూడో దశ పోలింగ్‌

– 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 93 స్థానాలకు ఎన్నికలు
-1,351 మంది అభ్యర్థులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నేడు మూడో దశ పోలింగ్‌ జరగనుంది. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 93 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 1,351 మంది అభ్యర్థులు బరిలో దిగారు. మే 7న జరిగే మూడో దశ పోలింగ్‌లో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగాల్సి ఉండగా, గుజరాత్‌లోని సూరత్‌లో బీజేపీ ఇప్పటికే అనూహ్యంగా గెలిచింది. అలాగే, జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌-రాజౌరీ స్థానానికి ఓటింగ్‌ మే 25కి వాయిదా పడింది. అయితే, మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో రెండో దశలో ఏప్రిల్‌ 26న జరగాల్సిన పోలింగ్‌ కూడా మూడో దశలో జరుగుతోంది. ఈ దశలో బరిలో నిలిచిన ప్రముఖులు కేంద్ర మంత్రులు అమిత్‌ షా (గాంధీనగర్‌), జ్యోతిరాదిత్య సింధియా (గుణ), బీజేపీ తిరుగుబాటు నాయకుడు కెఎస్‌ ఈశ్వరప్ప (షిమోగా), దిగ్విజరు సింగ్‌ (రాజ్‌ ఘడ్‌), డింపుల్‌ యాదవ్‌ (మెయిన్‌పురి), శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (విదిశ), సుప్రియా సులే (బారమతి) తదితరులు ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ఏప్రిల్‌ 19న తొలి దశ పోలింగ్‌, ఇక ఏప్రిల్‌ 29న రెండో దశ పోలింగ్‌ పూర్తైంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Spread the love