అద్వితీయ ఎంటర్టైనర్స్ పతాకంపై గుంట మల్లేశం, సిరి, స్వప్న నటీనటులుగా నర్సింగ్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ బి.రాంభూపాల్ రెడ్డి నిర్మిస్తున్న పక్కా తెలంగాణ కామెడీ చిత్రం ‘బ్రహ్మచారి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమైన సందర్భంగా ఈచిత్ర ఆడియోను తెలంగాణ ఉద్యమనేత, కవి, గాయకుడు, యం.యల్.సి దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై రిలీజ్ చేశారు. నిర్మాత బి.రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ,’దర్శకుడు
చెప్పిన కథ వాస్తవానికి ఎంతో దగ్గరగా ఉంది. అలాగే ప్రస్తుతం తెలంగాణలో బ్రహ్మచారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అందరికీ తెలిసిందే. ఆద్యంతం వినోదంతో ఉన్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు. ‘దుబారు వెళ్ళొచ్చిన ఓ యువకుడు పెళ్ళి చేసుకుందామనుకుంటే, అమ్మాయి దొరక్క ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు అనేదే ఈ చిత్రకథ’ అని దర్శకుడు నర్సింగ్ అన్నారు. హీరో గుంట మల్లేశం మాట్లాడుతూ,’తొలి సినిమాకే ఇలాంటి మంచి కథ ఉన్న చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు’ అని తెలిపారు.