గాజాలో పిల్లలను చంపడం ఆపాలన్న ట్రూడో..

నవతెలంగాణ -హైదరాబాద్: గాజాలో చిన్న పిల్లలు, మహిళలపై జరుగుతున్న హత్యాకాండ వెంటనే ఆపేయాలంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చిన్నారుల మరణాలు, మహిళల కన్నీళ్లను ప్రపంచమంతా టీవీల్లో, సోషల్ మీడియాలో చూస్తోందని వ్యాఖ్యానించారు. వైద్యులు, బాధితులు మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయాన్ని ట్రూడో గుర్తుచేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు.. కన్న బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు, చావు సమీపంలోకి వెళ్లి బతికి బయటపడ్డ బాధితుల అనుభవాలు హృదయవిదారకంగా ఉన్నాయని చెప్పారు. గాజాలో పిల్లల మరణాలను వెంటనే ఆపాల్సిన అవసరం ఉందంటూ ట్రూడో పరోక్షంగా ఇజ్రాయెల్ పై వ్యాఖ్యలు చేశారు. కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ పీఎం బెంజబిన్ నెతన్యాహు షార్ప్ గా రియాక్టయ్యారు. గాజాలో పిల్లలు, మహిళల మరణాలకు పూర్తి బాధ్యత హమాస్ మిలిటెంట్లదేనని స్పష్టం చేశారు. పౌరులపై దాడులు చేయడం, ప్రతి దాడులను తప్పించుకోవడానికి సామాన్యులను అడ్డుపెట్టుకోవడం వారికి అలవాటుగా మారిందని విమర్శించారు. గాజా సరిహద్దుల్లో గత నెల 7న హమాస్ మిలిటెంట్లు నిర్వహించిన మారణకాండను ప్రస్తావిస్తూ నెతన్యాహు ట్వీట్ చేశారు.

Spread the love