గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: మలేసియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు గగనతలంలో ఢీకొనడంతో 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. మలేసియాలో ఈ శుక్రవారం (ఏప్రిల్‌ 26) రాయల్‌ మలేసియన్‌ నేవీ దినోత్సవం జరగనుంది. ఇందుకోసం పెరక్‌లోని లుమత్‌ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయం శిక్షణ విన్యాసాల నిమిత్తం పడంగ్‌ సితియావాన్‌ నుంచి గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ప్రమాదవశాత్తూ ఢీకొని కుప్పకూలాయి. వీటిల్లో ఒకటి విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్థానిక స్టేడియంలో కూలిపోగా.. మరొకటి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో ఉన్న 10 మంది సిబ్బంది మరణించారు. వీరిలో ఇద్దరు లెఫ్టినెంట్‌ కమాండర్లు ఉన్నారు. హెలికాప్టర్లు కూలుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

Spread the love