నవతెలంగాణ -హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో నిమిషం ఆలస్యం కావడంతో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు పరీక్షకు దూరమయ్యారు. ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధనతో ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తో చెలగాట మాడుతున్నది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించకపోవడంతో కొంతమంది విద్యార్థులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష రాయడానికి స్థానిక ఇంటర్ కాలేజీకి ఇద్దరు విద్యార్థులు చేరుకున్నారు. పరీక్ష సమయం కంటే మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు సిబ్బంది అనుమతి నిరాకరించడంతో నిరాశగా వెనుదిరిగారు. అర్థం పర్థం లేని నిమిషం నిబంధన చట్రాల్లో విద్యార్థులను బిగించవద్దు. విద్యార్థుల బంగారు భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసే ఇలాంటి వికృత చేష్టలను మానుకోవాలి. కాబట్టి ఇంటర్ పరీక్షల విషయంలో భవిష్యత్తులో నిమిషం నిబంధనను బేషరతుగా ఎత్తివేయాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.