వాషింగ్టన్ సుంకాలకు దీటుగా మేమూ టారిఫ్ వసూలు చేస్తాం : కార్నే
వాషింగ్టన్ : కెనడా, అమెరికా మధ్య జరిగిన వాణిజ్య చర్చలు శుక్రవారం రాత్రి చివరి నిమిషంలో విఫలమయ్యాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా సుంకాలకు ధీటుగా తామూ టారిఫ్ విధిస్తామని కెనడా ప్రకటించింది. కెనడాకు చెందిన కొన్ని వస్తువులపై యాభై శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ‘మేము అనుకున్న విధంగా ఒప్పందానికి రావడంలో పొరుగు దేశం విఫలమైంది. ఫలితంగా అమెరికాతో వాణిజ్య చర్చలు నిలిపివేయాలని నేను నిర్ణయించాను. రాజధాని ఒట్టావోకు తిరిగి రావాల్సిందిగా మా చర్చల ప్రతినిధులను ఆదేశించాను’ అని కెనడా ప్రధాని మార్క్ కార్నే చెప్పారు. చర్చలు విఫలమైన నేపథ్యంలో 20 బిలియన్ డాలర్ల విలువైన కెనడా వస్తువులపై 50 శాతం టారిఫ్ విధించేందుకు అమెరికా సిద్ధపడుతోంది. కాగా ‘మా కార్మికులు, వ్యాపారాల ప్రయోజనాలను కాపాడేందుకు మేము కూడా అంతే మొత్తంలో అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తాం’ అని కార్నే తెలిపారు.
కెనడాపై వాణిజ్య చర్చలు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో సుంకాల విధింపును మూడు రోజులపాటు నిలిపివేస్తున్నామని ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలి సిందే. ట్రంప్-కార్నే మధ్య, అలాగే ఇరు దేశాలకూ చెందిన సీనియర్ వాణిజ్య అధికారుల మధ్య వారంరోజులుగా విస్తృత చర్చలు జరుగుతున్నాయి. కెనడాతో ఒప్పందానికి వచ్చామని, అయితే పత్రాల ఖరారుపై అది ఆధారపడి ఉంటుందని ట్రంప్ ఈ వారం ప్రారంభంలో చెప్పారు. ‘మా మార్కెట్లకు వస్తువులను ఎగుమతి చేసే ఏ ప్రధాన దేశానికైనా లభిస్తున్న అత్యుత్తమ ప్రాధాన్యతను కెనడాకు కల్పిస్తామని హామీ ఇచ్చాము.అయితే కెనడా తాజాగా కొన్ని కొత్త డిమాండ్లను ముందుకు తెచ్చింది. ఇప్పటికే ఇచ్చిన హామీల నుంచి వెనక్కి తగ్గింది.దీంతో కొంతకాలంగా సాధిస్తూ వచ్చిన సమతుల్యత దెబ్బతిన్నది’ అని అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమైసన్ గ్రీర్ విమర్శించారు.
అమెరికా-కెనడా వాణిజ్య చర్చలు విఫలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



