న్యూఢిల్లీ : వెనిజులా తాత్కాలిక అధ్యక్షరాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం భారత్ కు చేరుకున్నారు. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీ లో విమానాశ్రయానికి చేరుకున్న డెల్సీ రోడ్రిగ్జ్ కు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా డెల్సీ రోడ్రిగ్జ్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, విదేశాంగ మంత్రి జై శంకర్తో సహా ఇతర నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ పర్యటన ఈ నెల 7 వరకు కొనసాగుతుందని విదేశాగ మంత్రిత్వశాఖ ప్రకటన పేర్కొంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఔషధాలు, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధనం వంటి కీలక రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొంచుకునేందుకు ఈ చర్చలు జరగనున్నాయని విదేశాంగ ప్రకటన పేర్కొంది. ఈ పర్యటనలో డెల్సీ రోడ్రిగ్జ్ వెంట ఆ దేశ విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, వాణిజ్య, శాస్త్ర; సాంకేతిక, సమాచార, రవాణా శాఖలకు చెందిన మంత్రులు, అధికారులు కూడా ఉన్నారు. ఐదు నెలల క్రితం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అధ్యక్ష భవనం నుంచి అమెరికా సైన్యం బలవంతంగా కిడ్నాప్ చేసిన తరువాత డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షరాలిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, డెల్సీ రోడ్రిగ్జ్ భారత్లో పర్యటించడం ఇది ఆరోసారి. విదేశాంగ మంత్రిగా 2015లో, ఉపాధ్యక్ష పదవి హోదాలో 2019, 2023, 2024, 2025లో పర్యటించారు. ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షురాలి హోదాలో ఆరవ సారి భారత్లో ఆమె పర్యటిస్తున్నారు.



