వాడా ఆరు నెలల నోటీసు అడ్డంకిరెజ్లింగ్ సమాఖ్య రూల్స్ తో అనర్హత
న్యూఢిల్లీ : భారత స్టార్ రెజ్లర్, 2024 పారిస్ ఒలింపిక్స్లో పసిడి పోరుకు చేరినా.. పతకం చేజార్చుకున్న వినేశ్ ఫోగట్ మళ్లీ మ్యాట్పైకి రావాలనే సంకల్పానికి ఎన్నో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇటు వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ), డబ్ల్యూఎఫ్ఐ (భారత రెజ్లింగ్ సమాఖ్య) రూల్స్ వినేశ్ ఫోగట్ రీ ఎంట్రీని సందిగ్ధంలో పడేశాయి. 2024 పారిస్ ఒలింపిక్స్లో పతకం చేజారిన నైరాశ్యంలో వినేశ్ ఫోగట్ కుస్తీకి వీడ్కోలు పలికింది. వాడా నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని మళ్లీ బరిలోకి దిగుతున్న అథ్లెట్లు ఆరు నెలల ముందే సమాచారం అందించాలి. దీంతో రిజిస్టర్డ్ టెస్టింగ్ ఫూల్ (ఆర్టీపీ)లో అథ్లెట్ను చేర్చి, రెగ్యులర్గా శాంపిల్ సేకరణకు అవకాశం ఉంటుంది. వినేశ్ ఫోగట్ నుంచి వాడాకు లేదా నాడా (నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ)కి ఎటువంటి సమాచారం అందలేదు. 2026 ఆసియా గేమ్స్లో భారత్కు ప్రాతినిథ్యం వహించేందుకు తహతహలాడుతున్న వినేశ్ ఫోగట్కు భారత రెజ్లింగ్ సమాఖ్య నిబంధనలు ప్రతిబంధకంగా మారాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూపొందించిన రూల్స్ ప్రకారం ఆసియా గేమ్స్ ట్రయల్స్కు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పతక విజేతలతో పాటు 2026, 2025 సీనియర్ నేషనల్ చాంపియన్షిప్స్, జాతీయ అండర్-20 టోర్నమెంట్లో పతకాలు సాధించిన రెజ్లర్లు మాత్రమే అర్హులు. ఈ రెండేండ్ల ప్రదర్శన కాకుండా, గతంలో సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకోవటం లేదని రెజ్లింగ్ సమాఖ్య స్పష్టం చేసింది. ఈ నెల 10 నుంచి ఉత్తరప్రదేశ్లోని గోండాలో జాతీయ ఓపెన్ చాంపియన్షిప్స్ జరుగుతుండగా.. మహిళల 57 కేజీల విభాగంలో పోటీపడేందుకు వినేశ్ ఫోగట్ సిద్ధమవుతోంది. ఆసియా గేమ్స్ జట్టు కోసం ఈ నెల 30 న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ట్రయల్స్ నిర్వహించనున్నారు. జాతీయ ఓపెన్ చాంపియన్షిప్స్లో పతకం సాధించినా, ట్రయల్స్లో పోటీపడేందుకు వినేశ్ ఫోగట్ అర్హత సాధించదు. ఈ నేపథ్యంలో వినేశ్ ఫోగట్ రిటైర్మెంట్ కొనసాగిస్తుందా? లేదంటే రీ ఎంట్రీ ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
వినేశ్ పునరాగమనం కష్టమే!
- Advertisement -
- Advertisement -



