లిబియాలో జలసమాధి

– నౌక మునిగి 61 మంది వలస కూలీల మృతి
– చనిపోయిన వారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే
ట్రిపోలి: లిబియాలో పడవ ప్రమాదంలో మహిళలు, పిల్లలతో సహా 61 మంది చనిపోయారు. మొత్తం 86 మందితో వెళ్తున్న ఓడ బలమైన అలల తాకిడికి బోల్తా పడింది. వీరిలో 25 మందిని రెస్క్యూ టీమ్స్‌ సురక్షితంగా బయటికి తీసుకొచ్చాయి. మిగతా వారు బతికి ఉండే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం లిబియా తీరంలో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. నైజీరియా, గాంబియా తదితర ఆఫ్రికా దేశాలకు చెందిన 86 మంది ఐరోపా దేశాలకు వలస వెళ్లేందుకు లిబియా నుంచి పడవలో బయలుదేరారు. లిబియా తీరానికి సమీపంలో పడవ బోల్తా పడినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ (ఐఒఎం) తెలిపింది. లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణ సమీపంలో బలమైన అలల తాకిడికి పడవ కొట్టుకుపోయినట్లు ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు వెల్లడించారు. ఇప్పుడు ప్రమాదం జరిగిన మధ్యధరా సముద్రంలోని ఈ మార్గంలో గతంలో కూడా పలు ప్రమాదాలు సంభవించాయి. మెరుగైన జీవితం కోసం చాలా మంది ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపా దేశాలకు వలస వెళ్లేందుకు ఈ మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు. యుద్ధాలు, పేదరికం నేపథ్యంలో పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల నుంచి ఏటా వేల మంది ఐరోపా దేశాలకు వలసపోతున్నారు. నియంత గఢాఫీ మరణానంతరం లిబియాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ భూభాగంపై ఎవరికీ సరైన నియంత్రణ లేకపోవటంతో యూరప్‌కు చేరుకో వాలనుకుంటున్న వారంతా లిబియా తీరం నుంచే బయల్దేరుతున్నారు.
గడాఫీ మరణానంతరం కల్లోలంగా లిబియా
తమ చమురు అవసరాలు, లాభాల కోసం లిబియా అధ్యక్షుడు గడాఫీతో యుద్ధం చేసి, హత్య చేసిన తరువాత ఆ దేశం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మానవ అక్రమ రవాణాదారులకు కూడా లిబియాలోని కల్లోల పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఆరు దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న లిబియాలోకి ఆఫ్రికా దేశాల నుంచి వలసదారులు పోటెత్తుతున్నారు. వీరందరినీ ప్రమాదకరమైన పడవల్లో కుక్కి తీరం దాటిస్తుంటారు. ఎవరైనా పట్టుబడి తిరిగి లిబియాకు వస్తే ప్రభుత్వ నిరాశ్రయ కేంద్రాల్లో ఉంచుతున్నారు. వారిని నిర్బంధ శ్రామికులుగా మారుస్తున్నారు. వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వారి నుంచి డబ్బును లాక్కుంటున్నారు.

Spread the love