భారత్‌కు ముద్దు…అమెరికాకు వద్దు

– వాషింగ్టన్‌ నిషేధ జాబితాలో ఇజ్రాయిల్‌ నిఘా సంస్థలు
– వాటికి ప్రెడేటర్‌ స్పైవేర్‌తో సంబంధాలు
– అదే స్పైవేర్‌ కొనుగోలుకు భారత్‌ ఆసక్తి
వాషింగ్టన్‌ : భారత్‌ సహా పలు దేశాలలో రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులు, పాత్రికేయులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని రాబట్టుకునేందుకు ఆయా ప్రభుత్వాలు స్పైవేర్‌ను ప్రయోగించడం కొత్తేమీ కాదు. తాజాగా ప్రెడేటర్‌ స్పైవేర్‌ను అభివృద్ధి చేసి విక్రయిస్తున్న రెండు ఇజ్రాయిల్‌ నిఘా సంస్థలను అమెరికా వాణిజ్య శాఖ మంగళవారం నిషేధిత జాబితాలో ఉంచింది. అయితే ఇదే ప్రెడేటర్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేసేందుకు మోడీ ప్రభుత్వం ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ప్రెడేటర్‌ అభివృద్ధి కోసం యూరప్‌ నుండి కార్యకలాపాలు సాగిస్తున్న ఈ రెండు సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సంస్థల సమాచార గోప్యతకు, భద్రతకు ముప్పుగా పరిణమించాయని అమెరికా అభిప్రాయపడింది. తాజా నిషేధం ప్రకారం… గ్రీస్‌లోని ఇంటెలెక్సా, హంగరీలోని సైట్రాక్స్‌ కంపెనీలతో పాటు ఐర్లాండ్‌, ఉత్తర మసెడోనియా దేశాలలోని వాటి అనుబంధ సంస్థలు అమెరికా నుండి వస్తువులు, సేవల ఎగుమతి లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేస్తే దానిని తిరస్కరిస్తారు. ఇంటెలిజెన్స్‌ సంస్థలకు, చట్టాలను అమలు చేసే సంస్థలకు వాణిజ్య స్పైవేర్‌ను విక్రయిస్తున్న కంపెనీలపై బైడెన్‌ ప్రభుత్వం వేటు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ చర్యలలో భాగంగానే తాజా నిర్ణయం వెలువడింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ఎన్‌ఎస్‌ఓకు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌కు ప్రత్యామ్నాయంగా ఇంటెలెక్సాకు చెందిన ప్రెడేటర్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేసేందుకు భారత్‌ ఆసక్తి చూపుతోందని మార్చిలోనే వార్తలు వచ్చాయి. పెగాసస్‌ స్పైవేర్‌ను అమెరికా ప్రభుత్వం గతంలోనే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ప్రెడేటర్‌ స్పైవేర్‌ను ఇజ్రాయిల్‌ సైన్యానికి చెందిన మాజీ సైనికాధికారులు అభివృద్ధి చేశారు.
అప్పుడు పెగాసస్‌…
పాత్రికేయులు, ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ విమర్శకులు, హక్కుల కార్యకర్తలు వంటి ప్రముఖులను పెగాసస్‌ లక్ష్యంగా చేసుకుందని 2021లో వార్తలు వచ్చాయి. వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని యావత్తూ ఆ స్పైవేర్‌లో పెగాసస్‌ నిక్షిప్తం చేసింది. దానిని కొన్ని ప్రభుత్వాలకు విక్రయించింది. అయితే ఏయే దేశాలకు అమ్మిందీ ఎన్‌ఎస్‌ఓ గ్రూపు బయటపెట్టలేదు. పెగాసస్‌ గూఢచర్యంపై పలు కథనాలు రావడంతో అమెరికా ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఓ పైన, మరో ఇజ్రాయిల్‌ సంస్థ కాన్‌డిరూ పైన 2021 నవంబర్‌లో నిషేధం విధించింది. ఎన్‌ఎస్‌ఓ మాదిరిగానే ఇప్పుడు రెండు యూరోపియన్‌ సంస్థలు వ్యవస్థలో చొరబడి ప్రపంచ దేశాలలోని వ్యక్తులు, సంస్థలకు చెందిన సమాచారాన్ని చోరీ చేసి, వాటి భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని అమెరికా వాణిజ్య శాఖ తెలిపింది. ఈ సంస్థల కార్యకలాపాలు అమెరికా జాతీయ భద్రత, విదేశీ విధాన ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నాయని వివరించింది.
2017లో కుదిరిన విస్తృత రక్షణ ఒప్పందంలో భాగంగా మన ప్రభుత్వం ఇజ్రాయిల్‌ నుండి పెగాసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేసింది. అయితే దీనిపై దేశంలో రాజకీయ దుమారం రేగింది. ప్రత్యర్థులపై పెగాసస్‌ను ప్రయోగించడాన్ని మానవ హక్కుల సంఘాలు పసిగడతాయని, అలాగే బాధితులను యాపిల్‌, వాట్సప్‌లు సంప్రదించే అవకాశం ఉన్నదని మోడీ ప్రభుత్వంలోని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
దుకాణాలు సర్దుకొని…
పెగాసస్‌ను అభివృద్ధి చేసినట్లుగానే ప్రెడేటర్‌ను కూడా ఇజ్రాయిల్‌ మాజీ సైనికాధికారులే అభివృద్ధి చేశారు. ప్రెడేటర్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేసే విషయాన్ని మోడీ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. దీనిని సైట్రాక్స్‌ అభివృద్ధి చేయగా గ్రీస్‌ సంస్థ ఇంటెలెక్సా విక్రయించింది. ఈ రెండు సంస్థలకూ ఇజ్రాయిల్‌ దేశానికి చెందిన వేర్వేరు వ్యక్తులు యజమానులు. వీరిలో ఇజ్రాయిల్‌ సైనిక ఇంటెలిజెన్స్‌ సెలక్ట్‌ టెక్నాలజీ యూనిట్‌ కమాండర్‌ తాల్‌ దిలియన్‌ ఒకరు. ఎన్‌ఎస్‌ఓ, కాన్‌డిరూ సంస్థలను నిషిద్ధ జాబితాలో పెట్టడంతో సైబర్‌ గూఢచర్యానికి పాల్పడుతున్న పలు ఇతర సంస్థలు ఇజ్రాయిల్‌లో దుకాణాలు సర్దుకొని, వేరే ప్రాంతాలకు తరలిపోయి కార్యకలాపాలు ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం నిషేధ జాబితాలో చేర్చిన రెండు కంపెనీలు మూట ముల్లె సర్దుకొని విదేశాలకు పోయినా అవి తమ గూఢచర్యాన్ని సజావుగా సాగించలేవని, అవి ఎక్కడ ఉన్నప్పటికీ అమెరికా వదిలిపెట్టదని అధకార వర్గాలు హెచ్చరించాయి.
2021లో వెలుగులోకి…
టొరంటో యూనివర్సిటీకి చెందిన సిటిజన్‌ ల్యాబ్‌ 2021 డిసెంబర్‌లో తొలిసారిగా ప్రెడేటర్‌ స్పైవేర్‌ను వెలుగులోకి తెచ్చింది. అప్పటి వరకూ దాని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈజిప్ట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల పరికరాలలో ఈ స్పైవేర్‌ గూఢచర్య ఉపకరణాన్ని అమర్చిందని ల్యాబ్‌ గుర్తించింది. గ్రీకు ఇంటెలిజెన్స్‌ విభాగం పురమాయించినందుకే ప్రెడేటర్‌ స్పైవేర్‌ తన ఫోన్‌లోని సమాచారాన్ని తస్కరించిందని ఓ పాత్రికేయుడు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపారు. పాత్రికేయుడు చెప్పింది నిజమేనని గ్రీకు ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతి పార్లమెంటరీ కమిటీ ఎదుట అంగీకరించారు కూడా. పాత్రికేయులు, ప్రతిపక్ష సభ్యులకు వ్యతిరేకంగా స్పైవేర్‌ను ఎలా ఉపయో గిస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే గూఢచర్యం జరుగుతున్న విషయం ప్రభుత్వానికి తెలియదని ప్రధాని మిసోటకిస్‌ వివరణ ఇచ్చుకున్నారు. యూరోపియన్‌ యూనియన్‌ చట్టాలకు విరుద్ధంగా ఇజ్రాయిల్‌ సంస్థ ఈ స్పైవేర్‌ను ఇతర దేశాలకు అమ్ము కుంటోందని ఆరోపణలు వచ్చాయి.

Spread the love