ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై ఈసీ వేటు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. వివాదాస్పద అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం టౌన్ డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాలను బదిలీ చేసింది. టీడీపీ నేతల ఫిర్యాదుపై విచారణ జరిపిన ఈసీ తాజాగా చర్యలు తీసుకుంది. అనంతపురం టౌన్ లో తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని టీడీపీ ఆరోపించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత మూడేళ్లుగా అనంతపురం టౌన్ లో వీరరాఘవరెడ్డి తమ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడింది. నాన్ బెయిలబుల్ కేసులు పెడుతూ టీడీపీ జిల్లా నేతలను జైలు పాలు చేశారని ఆరోపించింది. ఇటీవల టీడీపీ నేతపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. దీనిపై టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం.. డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై వేటు వేసింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా రాయచోటీ డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషా పైనా వేటు వేసింది. ఈ ఇద్దరు అధికారులను వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. తమ సబార్డినేట్స్ కు ఛార్జ్ అప్పగించి విధుల నుంచి రిలీవ్ కావాలని డీజీపీ మెమోరాండం రిలీజ్ చేశారు.

Spread the love