బ్రెజిల్‌ వరదలు..60 మంది మృత్యువాత

నవతెలంగాణ-హైదరాబాద్ : భారీ వర్షాల ధాటికి బ్రెజిల్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. దేశ దక్షిణ ప్రాంతంలోని రియో గ్రాండ్ డి సుల్‌ రాష్ట్రం అతలాకుతలమైంది. దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది వరకు గల్లంతయ్యారు. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. గత 80 ఏళ్లలో ఈ స్థాయిలో వరదలు ముంచెత్తడం ఇదే తొలిసారని అక్కడి వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ ఏడాది బ్రెజిల్‌ను కుదిపేసిన నాలుగో విపత్తు ఇది. జులై, సెప్టెంబరు, నవంబరులోనూ వరదల వల్ల 75 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా కొన్ని ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం 150 ఏళ్ల క్రితం నాటి రికార్డు స్థాయిని దాటిందని బ్రెజిల్‌ జియోలాజికల్‌ సర్వీస్‌ వెల్లడించింది. చాలా ప్రాంతాల్లో తాగునీటి, విద్యుత్తు, సమాచార వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేయడం కష్టంగా మారింది. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. సైన్యాన్ని రంగంలోకి దించింది.

Spread the love