నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ

నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో పోలింగ్​ తేదీ సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీల కీలకనేతలందరూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మెజార్టీ పార్లమెంట్​ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా, ఎన్నికల ప్రచారంపై మరింత దృష్టిసారించిది. ప్రచారంలో మరింత జోష్​ పెంచడానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి మే 10వ తేదీ వరకు రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈరోజు ఉదయం నాంధేడ్‌ నుంచి నేరుగా నిర్మల్​లో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. అక్కడ అదిలాబాద్‌ అభ్యర్ధి ఆత్రం సుగుణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఆ తరువాత అక్కడి నుంచి నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని అలంపూర్‌ ఎర్రవల్లి కూడలి వద్ద జరగనున్న ఎన్నికల ప్రచార సభకు సాయంత్రం 5 గంటలకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. తిరిగి ఈ నెల 9న ఉదయం కరీంనగర్, సాయంత్రం 5 గంటలకు సరూర్ నగర్‌లో రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తారు.

Spread the love