కర్ణాటక సెక్స్ కుంభకోణం..హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్..

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న కర్ణాటక సెక్స్ కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగం పెంచింది. ఈ కేసులో జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మైసూరు కిడ్నాప్ కేసులో హెచ్‌డీ రేవణ్ణ పెట్టుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌ను బెంగళూరు కోర్టు కొట్టివేయడంతో రేవణ్ణను సిట్ అదుపులోకి తీసుకుంది.
హెచ్‌డీ రేవణ్ణ తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ నివాసంలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకున్న అధికారులు ఆపై సీఐడీ కార్యాలయంలో అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది. ఆ తర్వాత ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించింది. అంతకుముందు కిడ్నాప్ బాధితురాలిని హన్సూర్ తాలూకా కలెనహళ్లిలోని రేవణ్ణ సన్నిహిత అసిస్టెంట్ రాజశేఖర్ ఫాంహౌస్ నుంచి పోలీసులు విడిపించారు. రేవణ్ణ ఇంటిలో దాదాపు ఐదేళ్లపాటు పనిచేసిన మహిళ కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రేవణ్ణపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. కేసులో జోక్యం చేసుకోను రేవణ్ణ బంధువు సతీశ్ బాబన్న ఏప్రిల్ 29న తన తల్లిని కిడ్నాప్ చేసినట్టు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆమె బందీగానే ఉంది. ఈ కేసు దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకునేది లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణ పెట్టుకున్న మందస్తు బెయిలు పిటిషన్‌ను బెంగళూరు కోర్టు నిన్న కొట్టివేసింది.

Spread the love