28న పీజీఈసెట్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌

– 31 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
– ఆగస్టు 21 నుంచి వెబ్‌ఆప్షన్ల నమోదు
– 26న మొదటివిడత సీట్ల కేటాయింపు
– షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎంఈ/ఎంటెక్‌తోపాటు ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, ఫార్మా-డీ(పీబీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం పోస్టు గ్రాడ్యుయెట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ( పీజీఈసెట్‌) నోటిఫికేషన్‌ ఈనెల 28న విడుదల కానుంది. బుధవారం హైదరాబాద్‌లో పీజీఈసెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మెన్లు వి వెంకట రమణ, ఎస్‌కె మహమూద్‌, కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు, పీజీఈసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ పి రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం షెడ్యూల్‌ను విడుదల చేశారు. పీజీఈసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఈనెల 31 నుంచి వచ్చేనెల 18 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌తోపాటు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. వచ్చేనెల ఏడు నుంచి తొమ్మిది వరకు ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల (ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్‌, స్పోర్ట్స్‌)కు భౌతిక పరిశీలన ఉంటుందని తెలిపారు. అదేనెల 20న అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. 21 నుంచి 23 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశముంటుందని వివరించారు. 26న మొదటివిడత సీట్లు కేటాయిస్తామని తెలిపారు. 28 నుంచి 30 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలనీ, ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో ట్యూషన్‌ ఫీజు చెల్లించాలని కోరారు. సెప్టెంబర్‌ నాలుగున పీజీఈసెట్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని పేర్కొన్నారు. అదేనెల 4 నుంచి ఎనిమిది వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌తోపాటు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. 11, 12 తేదీల్లో వెబ్‌ఆప్షన్లను నమోదు చేయాలని సూచించారు. 16న సీట్లు కేటాయిస్తామని వివరించారు. 19 నుంచి 23 వరకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలనీ, ట్యూషన్‌ ఫీజు చెల్లించి ఒరిజినల్‌ ధ్రువపత్రాలను సమర్పించాలని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 19 నుంచి పీజీఈసెట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇతర వివరాలకు ఈనెల 28 నుంచి http://pgecetadm. tsche.ac.in  వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Spread the love