డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలిస్తాం

డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలిస్తాం– ఆ మహమ్మారిని కలిసి కట్టుగా ఎదుర్కొందాం
– తాత్కలిక సంతోషం కోసం భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
– విద్యా సంస్థల్లో నిఘా పెట్టాం : మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
డ్రగ్స్‌ రహిత సమాజం కోసం అందరూ ప్రతినబూనాలని పంచాయితీ రాజ్‌ గ్రామీణాభివద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అందరూ సహకరించాలని కోరారు. వాటికి వ్యతిరేకంగా యువత పోరాడాలని సూచించారు. ‘అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దురలవాటు – అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. డ్రగ్‌ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని పోలీస్‌లకు, యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరోకు సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సీతక్క గుర్తు చేశారు. డ్రగ్స్‌ వాడితే కుటుంబాలు చితికిపోవడంతో పాటు మానసిక కుంగుబాటుతో అచేతనంగా మిగిలిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
డ్రగ్స్‌, గంజాయి మత్తులో అనేక మంది లైంగిక దాడులు, హత్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి, ఇండియన్‌ విమెన్‌ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ పద్మశ్రీ మిథాలి రాజ్‌, సీనియర్‌ నటులు సుమన్‌, హన్‌ మాన్‌ ఫేం యువ హీరో శ్రీ తేజ సజ్జ, డీజీపీ రవి గుప్తా, హౌం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జితేందర్‌, టీజీ న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్యా, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ శ్రీధర్‌, డీసీఏ డైరెక్టర్‌ కమలాసన్‌ రెడ్డి, వికలాంగులు, వయోవృద్ధులు సాధికారత శాఖ డైరెక్టర్‌ శైలజ తదితరులు పాల్గొన్నారు.

Spread the love