ప్రతి పథకాన్నీ అమలు చేసి తీరుతాం..

– రఘువీర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి : సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి
నవతెలంగాణ-పెద్దఅడిశర్లపల్లి
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని ప్రతి పథకాన్నీ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అంగడిపేట ఎక్స్‌రోడ్డు వద్ద నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. మతతత్వ రాజకీయాలు, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. నల్లగొండ లోక్‌సభకు వామపక్షాలు బలపరిచిన కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్‌ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల బతుకుల్లో వెలుగులు నింపామని, గ్రామాల అభివృద్ధి జరిగిందని అన్నారు. వామపక్షాలతో కలిసి తాగు, సాగునీటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశామన్నారు. త్వరలోనే ఎస్‌ఎల్బీసీ సొరంగ మార్గాన్ని, కాలువను పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల కోడ్‌ ముగియగానే రెండు పడక గదుల ఇండ్లు, రూ.2 లక్షల రుణమాఫీ, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు నేనావత్‌ బాలునాయక్‌, నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి, ఎంపీపీ వంగాల ప్రతాపరెడ్డి, సీపీఐ(ఎం) నాయకులు కంబాలపల్లి ఆనంద్‌, సీపీఐ నాయకులు కలకొండ కాంతయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు వీరబోయిన ఎల్లయ్యయాదవ్‌, యువనేత డాక్టర్‌ పాల్వాయి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Spread the love