పదేండ్లు ఏం చేశారు?

పదేండ్లు ఏం చేశారు?– మీ హయాంలోనే సింగరేణి గనుల్ని వేలం వేశారు
– అవంతిక, అరబిందోకు అప్పగించింది మీరేగా…
– మాజీ మంత్రి కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ కౌంటర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణిని, ఔటర్‌ రింగ్‌ రోడ్డును టోకున ప్రయివేటుకు అమ్మేసిన వ్యక్తి హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి కే తారకరామారావును ఉద్దేశించి ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా వ్యాఖ్యానించారు. ”పదేండ్లుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల మాటలను మీరు పట్టించుకోలేదు. కనీసం వినడానికి కూడా ఇష్టపడలేదు. మీరు ఇప్పుడు వాస్తవాలను వింటారనే నమ్మకం కూడా లేదు. అయినప్పటికీ.. మీలో మార్పు రావాలని కోరుకుంటూ వాస్తవాలను మరోమారు తెలియజేస్తున్నాం” అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి రాసుకొచ్చారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను మొట్టమొదటి సారి వేలం వేసింది. రెండు ప్రయివేటు కంపెనీలకు అప్పగించింది. అరబిందో మరియు అవంతిక అనే రెండు కంపెనీలకు కట్టబెట్టింది మీ ప్రభుత్వ హయాంలోనే. అందుకు సహకరించింది మీ ప్రభుత్వమే. అప్పుడు మీరు, మీ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. మా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు సింగరేణి గనులను ప్రయివేటీకరించడం, వేలం వేయడాన్ని వ్యతిరేకించారు. మీ ప్రియమైన అవంతిక మరియు అరబిందో కంపెనీలకు మీరు అప్పగించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని కూడా డిమాండ్‌ చేశారు అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల్ని, వారి ప్రయోజనాలు, వారి ఆస్తులు, హక్కులను కాపాడేది కాంగ్రెస్‌ ఒక్కటేననీ, రాష్ట్ర భవిష్యత్‌ కాంగ్రెస్‌తో సురక్షితంగా ఉంటుందనీ, మన బొగ్గు.. మన హక్కుల్ని కాపాడి తీరుతామని పోస్ట్‌ చేశారు.

Spread the love