నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఈ లోక్సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతుండటంపై మీడియా ప్రశ్నించడంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్గాంధీ కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి బరిలో దిగుతున్నారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో అమేథీలో ఓడిపోతాననే భయంతోనే రాహుల్గాంధీ వాయనాడ్కు పారిపోయారని, ఈ ఎన్నికల్లో వాయనాడ్లో ఓడిపోతాననే భయంతో రాయ్బరేలీకి పారిపోయారని విమర్శిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు కేసీ వేణుగోపాల్ ముందు ప్రస్తావించగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అది పార్టీ నిర్ణయమని, పార్టీకి నమ్మకస్తుడైన సైనికుడు పార్టీ నిర్ణయాన్ని శిరసావహించడం ఆయన బాధ్యతని కేసీ వేణుగోపాల్ అన్నారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం ఏమన్నా తప్పా, మాజీ ప్రధాని అటల్బిహరీ వాజ్పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ ఒకటి మించిన నియోజకవర్గాల్లో పోటీ చేశారుగా అని గుర్తుచేశారు.