బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌కుండా…

బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌కుండా...సుధా వర్గీస్‌… బీహార్‌లోని ముసాహర్‌ కమ్యూనిటీకి చెందిన మహిళలు, బాలికల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నారు. తరతరాలుగా ప్రతి దశలోనూ వివక్షను ఎదుర్కొంటున్న వారికి హక్కుల గురించి వివరిస్తున్నారు. మాట్లాడే హక్కు ఉందని నేర్పుతున్నారు. దాని కోసమే నారీ గుంజన్‌ స్థాపించారు. వారి జీవితాల్లో పెను మార్పు రావాలంటే విద్య ఒక్కటే మార్గమని భావించి వారి కోసమే ప్రత్యేకంగా ఓ పాఠశాలను ప్రారంభించి అమ్మాయిలకు కొత్త జీవితాన్ని అందిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
‘బెదిరింపులు ఎదురైనా నాలోని భయాన్ని పైకి కనబడనీయను. ఈ వ్యూహం చాలా ఏండ్లుగా నాకు బాగా పనిచేస్తోంది’ అంటూ సుధా వర్గీస్‌ తాను ప్రారంభించిన పాఠశాల కారిడార్‌లో కూర్చొని నవ్వుతూ చెబుతోంది. ఆమె కూర్చున్న ఆ పాఠశాల సాధారణ విద్యాసంస్థ కాదు. బీహార్‌లోని సామాజికంగా వెనుకబడిన సమూహాలకు చెందిన బాలికల జీవితాల్లోని కథలకు కొత్త ఆరంభాన్ని అందించేందుకు ఆమె ప్రారంభించారు.
జీవన పరిస్థితులు చూసి
సుధ బీహార్‌లోని ముసాహర్‌ కమ్యూనిటీ సాధికారత కోసం తన జీవితంలో 30 ఏండ్లకు పైగా అంకితం చేశారు. దీన్ని ఆమె తన యుక్తవయసులో ఉన్నప్పుడు ప్రారంభించారు. ఆమె ఒకరోజు తన పాఠశాల లైబ్రరీలో చదువుతున్నపుడు ఒక పత్రిక ఆమె దృష్టిని ఆకర్షించింది. అభివృద్ధికి చాలా దూరంగా, భయానకమైన చిత్రాలు అవి. బీహార్‌లోని ముసహర్ల భయంకరమైన జీవన పరిస్థితులను చూపించాయి. ‘ముసహర్‌’ అంటే ‘ఎలుకలు తినేవాళ్ళు’ అని అర్థం. తాను పుట్టి పెరిగిన కేరళలో ఇలాంటివి ఎన్నడూ ఆమె చూడలేదు. దాంతో తీవ్రమైన ఈ సామాజిక వెనుకబాటు సుధను ఆశ్చర్యపరిచింది. ముసాహర్‌ల జీవితాలను మెరుగుపరచడానికి తన వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు.
వివక్షను ఎదుర్కొంటున్నారు
1965లో ఆమె స్వయంగా బీహార్‌ వెళ్లి పేదలు, అణగారిన ప్రజల కోసం పనిచేశారు. మొదట పాట్నా నోట్రే డామ్‌ అకాడమీలో పని చేయడం ప్రారంభించారు. అక్కడ శిక్షణ తీసుకునే సమయంలో ఇంగ్లీష్‌, హిందీ నేర్చుకున్నారు. 1986లో ఆమె తన సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ముసాహర్‌లతో కలిసి జీవించాలని, వారికి విద్య అందించాలని, వారి జీవితాలను మెరుగుపరచడానికి తన పూర్తి సమయాన్ని, వనరులను వెచ్చించాలని నిర్ణయించుకున్నారు. అక్కడి ఒక గ్రామానికి వెళ్ళి పాత గుడిసెలో నివసించారు. ‘ఇది మొదట చాలా సవాలుగా ఉంది. మొదటి రాత్రి భారీ వర్షం కురిసింది. గుడిసెలోకి నీరు రాకుండా వంటపాత్రల్లో నీటిని సేకరించి బయటపడేయాల్సి వచ్చేది. అయితే దీనికి నేను సిద్ధంగా ఉన్నాను. దీని కోసమే నేను వచ్చాను’ అంటూ ఆమె గుర్తుచేసుకున్నారు. ముసహర్‌లతో కలిసి జీవించడంతో సుధకు జీవితంలో కొత్త కిటికీ తెర్చుకుంది. వారు పేదరికంపై మాత్రమే కాకుండా శతాబ్దాల నాటి కులతత్వ విధానాలపై కూడా పోరాడుతున్నట్లు ఆమెకు అర్థమైంది. ముసాహర్లు తమ జీవితంలోని ప్రతి దశలో వివక్షను ఎదుర్కొంటున్నారు. వారికి విద్యకు ప్రవేశం లేదు, భూమి లేదు. రోజు గడండం కోసం పొలాలలో పనిచేస్తారు. బాలికలు, మహిళలపై నిత్యం లైంగిక వేధింపులు, దాడులకు గురువుతున్నారు.
అన్యామాలపై పోరాటం
1987లో సుధా నారీ గుంజన్‌ (మహిళల వాయిస్‌) అనే సంస్థను స్థాపించారు. సామాజికంగా బహిష్కరించబడిన వేలాది మంది మహిళలకు మద్దతుగా నిలిచారు. ప్రారంభంలో మహిళలకు వారి చట్టపరమైన హక్కుల గురించి తెలియదు. వారిపై లైంగిక దాడి చేస్తే అది నేరమని కూడా వారికి తెలియదు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. మొదటిది జ్ఞానం లేకపోవడం. ఎందుకంటే వారికి ఎవ్వరూ ఈ విషయాల గురించి చెప్పలేదు. మాట్లాడే హక్కు వారికి ఉందని చెప్పలేదు. రెండవది సామాజిక నిర్మాణం. దీనిలో వారు దిగువన ఉంచబడ్డారు. ‘నువ్వు ఒక కుర్చీలో కూర్చుంటే నీ పక్కన మరో ఖాళీ కూర్చీ ఉన్నా వాళ్ళు దానిపై కూర్చోరు. నేలపై కూర్చోవడానికే ఇష్టపడతారు’ అని సుధ చెప్పారు. సమాజంలో వారి స్థానం అట్టడుగున ఉందని, అలాగే ఉంటుందని వాళ్లు నమ్ముతున్నారు. మూడవ కారణం వారు ఆధిపత్య వర్గంపై ఆధారపడటం. ఎందుకంటే వారి పొలాల్లో పని చేస్తేనే వీరి కడుపు నిండేది. అందుకే వారికి వ్యతిరేకంగా ఏదైనా చెప్పడానికి భయపడతారు.
పోలీస్‌స్టేషన్‌కు వెళితే
ఒకసారి గ్రామంలో జరిగిన లైంగిక దాడిపై ఫిర్యాదు చేసేందుకు సుధ పోలీసు స్టేషన్‌కి వెళితే ‘ఇంత మురికి బట్టలు వేసుకున్న అమ్మాయిని ఎవరు రేప్‌ చేస్తారు?’ అంటూ పోలీస్‌ అధికారి స్పందించాడు. పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లాలంటే వారికి భయం. సుధ లాయర్‌ కూడా కాబట్టి ఆమెకు ఈ విషయంలో కొంత ఉపయోగపడింది. రెండేండ్లలో ఆమె తొమ్మిది కేసులను నివేదించింది. ఇవన్నీ ఒకే ప్రాంతంలో జరిగాయని ఆమె చెప్పారు. ‘నన్ను గ్రామం నుండి తరిమికొట్టడానికి, నాకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడానికి ఎన్నో పన్నాగాలు పన్నారు. కానీ ఏమీ చేయలేకపోయారు. అయితే తక్కువ సమయంలో స్త్రీల వైఖరిలో గణనీయమైన మార్పును గమనించాను. వారు తమ చట్టపరమైన హక్కుల గురించి మరింత తెలుసుకున్నారు. అలాంటి సంఘటనలను నివేదించడానికి వారు ఇప్పుడు ఒంటరిగా పోలీసు స్టేషన్‌కు వెళతారు. పోలీసులు వినకపోతే నాకు ఫోన్‌ చేస్తారు. మేము వారికి సహాయం చేస్తాం’ ఆమె చెప్పారు.
బాలికలకు విద్య
ఒక పెను మార్పు తీసుకురావాలంటే ఆ బాలికలకు విద్యాబుద్ధులు అవసరమని సుధ అభిప్రాయపడ్డారు. అందుకే ఆమె బీహార్‌లోని దానాపూర్‌లో ప్రేరణ అనే రెసిడెన్షియల్‌ పాఠశాలను ప్రారంభించారు. దళిత బాలుర వసతి గృహం కోసం 1988లో భవనానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా విరాళాలతో 2006లో దాన్ని ప్రారంభించారు. ఇది అప్పట్లో 50 మంది బాలురు ఉండేలా రూపొందించబడింది. ఇప్పుడు పాఠశాలల్లో 150 మంది బాలికలు ఉన్నారు. ఇక్కడి అమ్మాయిలు ఎక్కువగా చదువుకుంటున్న మొదటి తరంవారు. వారు డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు కావాలని కోరుకుంటున్నారు. విద్యతో పాటు వారికి కరాటే, పెయింటింగ్‌, కళలు, చేతిపనులు కూడా నేర్పిస్తారు. ఆ పిల్లలు గుజరాత్‌లో జరిగిన కరాటే పోటీల్లో ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, 14 కాంస్య పతకాలు సాధించారు. వారు జపాన్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొన్నారు.
మహిళలకు జీవనోపాధికై
నారీ గుంజన్‌ బీహార్‌లోని వివిధ జిల్లాల్లో పనిచేస్తుంది. మహిళలకు బహుళ జీవనోపాధి ప్రాజెక్టులను అందజేస్తున్నారు. నారీ గుంజన్‌ సర్గమ్‌ మహిళా బ్యాండ్‌ విస్తృతమైన ప్రశంసలు అందుకుంది. ‘ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో మహిళలు ప్రదర్శనలు ఇవ్వడం చూశాను. వారు చేయగలిగితే నా స్త్రీలు ఎందుకు చేయలేరు? వారు మొదట సందేహించినప్పటికీ, అది పెద్ద విజయాన్ని సాధించింది. వారు ఇప్పుడు ఒక్కో ప్రదర్శనకు రూ.2,000 వరకు సంపాదిస్తున్నారు. ఇది ఫీల్డ్‌లలో వారు పొందే దానికంటే చాలా ఎక్కువ’ అని సుధ చెప్పారు. బీహార్‌లో మద్య నిషేధం తర్వాత కిచెన్‌/హోమ్‌ గార్డెన్‌లను ప్రారంభించి అదనపు ఉత్పత్తులను విక్రయించాలని సంస్థ మహిళలకు సూచించింది. ఇది కూడా విజయవంతమైంది. ముసహర్‌ మహిళలు ఇతరుల పొలాల్లో కాకుండా తమ కోసం వ్యవసాయం చేయడం ప్రధాన మలుపు. ఉల్లిసాగుతో కొందరికి రూ. 5 లక్షల వరకు లాభం వచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్లలో తమ పేర్లపై భూములు కొనుగోలు చేశారు.
ఇది ఆరంభం మాత్రమే
‘నా మహిళలు చరిత్రను తిరగరాస్తున్నారు. వారికి ఇప్పుడు సొంత భూమి ఉంది. ఇది ఆరంభం మాత్రమే’ అని సుధా అంటున్నారు. ఆమె ముఖం ఆశతో సజీవంగా ఉంది. నిజమైన సమానత్వాన్ని కోరుతూ ‘సిర్ఫ్‌ హంగామా ఖదా కర్నా మేరా మక్సద్‌ నహీ, మేరీ కోషిష్‌ హై కి యే సూరత్‌ బదల్ని చాహియే (కేవలం రచ్చను సృష్టించడం నా ఉద్దేశ్యం కాదు. మార్పు తీసుకురావడమే నా ఉద్దేశ్యం, పరిస్థితి మారాలి).’ దుష్యంత్‌ కుమార్‌ ప్రసిద్ధ పద్యాన్ని పాడే అమ్మాయిల శబ్దం పాఠశాల గోడల నుండి రోజూ ప్రతిధ్వనిస్తుంది. ఇది ప్రభుత్వానికి, సమాజానికి ఇంకా చాలా చేయవలసి ఉందని నిత్యం గుర్తు చేస్తుంటుంది. –

Spread the love