– భర్త, కుటుంబీకులపై తండ్రి ఫిర్యాదు
నవతెలంగాణ – జవహర్నగర్
వరకట్నం వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ప్రాణం తీసుకుంది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నాగరాజు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వేముల శ్రావణి(23)కి నాగులవంచ హేమ సుందర్తో 2023లో వివాహం జరిగింది. దంపతులిద్దరూ చిట్టినగర్ విజయవాడకు చెందినవారు కాగా హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వివాహ సమయంలో శ్రావణి తల్లిదండ్రులు కట్న కానుకలు ఇచ్చారు. అయితే, షాపు పెట్టుకునేందుకు మరికొంత నగదు కావాలని సుందర్ భార్యను వేధిస్తున్నాడు. దాంతోపాటు వివాహం జరిగి సంవత్సరానికి పైగా అయినప్పటికీ పిల్లలను కనడం లేదని శ్రావణిని భర్త, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు వేధించేవారు. వేధింపులు ఎక్కువవడంతో తట్టుకోలేక శ్రావణి ఆదివారం రాత్రి ఫ్యాన్కు ఉరేసుకుంది. తన కూతురి ఆత్మహత్యకు భర్త, ఇతర కుటుంబ సభ్యుల వరకట్న వేధింపులే కారణమని మృతురాలి తండ్రి వేముల ఏడుకొండలు సోమవారం జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యా? ఆత్మహత్యనా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.