– పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన యూపీ మహిళ
– 108 సిబ్బందిని అభినందించిన జిల్లా అధికారులు
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం తాళ్లమడ గ్రామంలో నివాసముంటున్న ఉత్తరప్రదేశ్కు చెందిన దేవి అనే గర్భిణికి ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. సమాచారం అందుకున్న సత్తుపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది తక్షణమే స్పందించి హుటాహుటిన ఆమె ఉంటున్న నివాస స్థలానికి చేరుకున్నారు. అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు(ఈఎంటీ) ప్రవీణ్, పైలట్ కట్టం మహేష్ స్థానిక ఆశా వర్కర్ సహాయంతో బాధితురాలిని సత్తుపల్లి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించేందుకు వాహనంలో బయలుదేరారు.
అయితే మార్గమధ్యంలోనే సదరు మహిళకు నొప్పులు మరింత తీవ్రం కావడంతో పరిస్థితిని గమనించిన సిబ్బంది అంబులెన్స్ను రోడ్డు పక్కన నిలిపివేశారు. గ్రీన్ హెల్త్ సర్వీస్ కాల్ సెంటర్ వైద్యుల పర్యవేక్షణలో వారి సూచనలు, సలహాలతో 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి అంబులెన్స్లోనే సురక్షితంగా ఆ మహిళకు డెలివరీ చేశారు. ఈ 5వ కాన్పులో ఆమె పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి దేవి, నవజాత శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రసవం అనంతరం వారిని తదుపరి సంరక్షణ కోసం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సకాలంలో స్పందించి ఇద్దరి ప్రాణాలను కాపాడిన 108 సిబ్బందిని తాళ్లమడ గ్రామస్తులతో పాటు, మూడు జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజీరుద్దీన్, నూతనంగా బాధ్యతలు చేపట్టిన 108 జిల్లా అధికారి ఆలేటి ప్రణయ్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది అభినందించారు.



