దిగొచ్చిన యూపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు కనీస వేతనాల పెంపు
ఇది తాత్కాలిక ఉపశమనం : కార్మిక సంఘాలు
లక్నో : కార్మికుల పోరాటానికి యూపీ ప్రభుత్వం తలొంచింది. తాత్కాలిక వేతన పెంపును ప్రకటించింది. నోయిడాలో కార్మికుల భారీ నిరసలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చింది. దీంతో అనుభవం లేని, అర్ధ నైపుణ్యం, నైపుణ్యం కలిగిన అన్ని వర్గాల కార్మికులందరికీ కనీస వేతనాలు తాత్కాలికంగా పెరగనున్నాయి.
మంగళవారంనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని నోయిడాలో కార్మికులు నిర్వహించిన భారీ నిరసనలు హింసాత్మకంగా మారిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడింది. అన్ని సంబంధిత వర్గాలతో చర్చలు జరిపిన తర్వాత ఈ తాత్కాలిక పెంపును అమలు చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా స్థిరమైన కనీస వేతనాలను నిర్ణయించడానికి వచ్చే నెలలో ఒక వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ బోర్డు సిఫారసుల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనుంది. తాత్కాలిక చర్యల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా అనుభవం లేని కార్మికుల కనీసవ వేతనాన్ని గరిష్టంగా 21 శాతం వరకు పెంచింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. కాగా కనీస వేతనం రూ.20 వేలు అంటూ వచ్చిన వార్తల్ని ఖండించింది.గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా కలెక్టర్ మెధా రూపం మాట్లాడుతూ… ” ఈ వేతన పెంపు నిర్ణయం హైపవర్డ్ కమిటీ తీసుకుంది. ముఖ్యమంత్రి ఆమోదంతో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది” అని తెలిపారు. ఈ నిర్ణయంతో గౌతమ్బుద్ధనగర్, ఘాజియాబాద్ జిల్లాల్లో కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. అనుభవం లేని కార్మికులకు నెలకు రూ.13,690 (గతంలో రూ.11,313), అర్ధనైపుణ్యం గల వారికి రూ.15,059, నైపుణ్యం కలిగిన వారికి రూ.16,868గా నిర్ణయించారు. ఇక ఇతర మునిసిపల్ ప్రాంతాల్లో అనుభవం లేని వారికి రూ.13,006, అర్ధ నైపుణ్యమున్నవారికి రూ.14,306, నైపుణ్యం గల వారికి రూ.16,025 వేతనం ఖరారు చేశారు. మిగిలిన జిల్లాల్లో ఈ వేతనాలు వరుసగా రూ.12,356, రూ.13,591, రూ.15,224గా ఉన్నాయి.
ఫలించిన కార్మికుల పోరాటం
- Advertisement -
- Advertisement -



