– ఈనెల 10న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
– పరిస్థితి విషమించి మృతి
– మెదక్ జిల్లాలో ఘటన
నవతెలంగాణ-రామాయంపేట
ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పులపాలై ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువకుడు పరిస్థితి విషమించి మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన భానుప్రసాద్(25) కొన్ని నెలలుగా ఆన్లైన్లో బెట్టింగ్స్ ఆడుతున్నాడు. పెద్దఎత్తున అప్పులు తెచ్చి బెట్టింగ్లో పెట్టి నష్టపోయాడు. దాంతో తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. మనస్తాపానికి గురై ఈనెల 10న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రామయంపేట ఎస్ఐ రంజిత్ తెలిపారు.