ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల

నవతెలంగాణ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌ (Congress)  నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటన చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నది. ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ (KC Venugopal) ప్రకటన విడుదల చేశారు.
పీసీసీ అధ్యక్షురాలిగా నియమించడంపట్ల వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘పీసీసీ అధ్యక్షురాలి పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్రంలో పార్టీ పునరుద్ధరణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా. రాష్ట్రంలో పార్టీకి గత వైభవం తీసుకొచ్చేందుకు పెద్దలు, సీనియర్లతో కలిసి చిత్తశుద్ధితో పనిచేస్తా’’ అని షర్మిల పేర్కొన్నారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వెతెపా) స్థాపించిన షర్మిల.. ఇటీవల కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీని విలీనం చేశారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరినప్పుడే ఏపీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. దాన్ని నిజం చేస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏపీ పీసీసీ చీఫ్‌ బాధ్యతలను ఆమెకు కట్టబెట్టింది.

Spread the love