నవతెలంగాణ చండీగఢ్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బుధవారం హర్యానాలోని ఝజ్జర్ జిల్లాకు చెందిన వీరేందర్ అఖాడాలో రెజ్లర్ల(wrestlers)తో సమావేశమయ్యారు. క్రీడాకారులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు, ఆ తర్వాత ఎన్నికల వ్యవహారంతో భారత రెజ్లింగ్ సమాఖ్య చుట్టూ వివాదాలు ముసురుకొన్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం బజరంగ్ పునియా (Bajrang Poonia) మీడియాతో మాట్లాడుతూ… ‘ఆయన మా రెజ్లింగ్ రొటీన్ను చూసేందుకు వచ్చారు. మాతో పాటు రెజ్లింగ్ కూడా చేశారు’ అని తెలిపారు. ఇటీవల జరిగిన రెజ్లింగ్ సమాఖ్య(WFI) ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్సింగ్ విజయం సాధించారు. ఇది రెజ్లర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. సంజయ్ ఎన్నికపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికే సాక్షి మలిక్(Sakshi Malik) రిటైర్మెంట్ ప్రకటించగా.. బజ్రంగ్ పునియా, వీరేందర్ యాదవ్ పద్మశ్రీ అవార్డులను వాపస్ చేశారు. ఖేల్రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు వినేశ్ ఫొగాట్(vinesh phogat) ప్రకటించారు.