రిటైల్‌ ద్రవ్యోల్బణం సెగ

– 6.52 శాతానికి ఎగిసిన సీపీఐ
న్యూఢిల్లీ : ధరల కట్టడికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఓ వైపున వడ్డీ రేట్లు పెంచుతుండగా.. మరోవైపు ద్రవ్యోల్బణం ఎగిసిపడు తోంది. కొత్త ఏడాది జనవరిలో భారత రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) 6.52 శాతానికి ఎగిసి.. మూడు నెలల గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యిందని సోమవారం గణంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంతక్రితం డిసెంబర్‌లో ఈ సూచీ 5.72 శాతంగా చోటు చేసుకుంది. సీపీఐ పెరగడం ద్వారా కుటుంబాల పొదుపు పడిపోవడంతో పాటుగా వినిమయం కూడా తగ్గనుంది. ఇది మరింత ఆర్థిక మందగమనం వైపు దారి తీయనుంది. గడిచిన జనవరిలో గ్రామీణ ప్రాంతాల్లో సీపీఐ 6.85 శాతానికి ఎగిసింది. ఇంతక్రితం డిసెంబర్‌లో ఇది 6 శాతంగా ఉంది. అహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 4.19 శాతం నుంచి 5.94 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ వరుసగా ఆరో సారి వడ్డీ రేట్లను పెంచి రెపోరేటును 6.5 శాతానికి చేర్చింది.

Spread the love