సరిహద్దు ఘర్షణలపై వాస్తవాలు వెల్లడించాలి

– పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ఆందోళన
న్యూఢిల్లీ: సరిహద్దు ఘర్షణలపై వాస్తవాలు వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. కేంద్ర ప్రభుత్వం దాచివేత ధోరణి ప్రదర్శించడం సమంజసం కాదని విమర్శించాయి. అసలు ఏం జరుగుతోందో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌చేశాయి. ఈ మేరకు పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. బుధవారం పార్లమెంట్‌లో ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట 12 ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఆయా పార్టీల ఎంపీలు ప్లకార్డులు చేబూని నినాదాలు హోరెత్తించారు. సరిహద్దు ఘర్షణలపై ప్రభుత్వం మౌనం వీడాలనీ, దేశ ప్రయోజనాలపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, అధిర్‌ రంజన్‌ చౌదరి, చిదంబరం, టిఆర్‌ బాలు, తిరుచ్చి శివ, సుప్రియా సూలే, ప్రియాంక చతుర్వేది, ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రారంభమైన లోక్‌సభ రెండు నిమిషాలకే ప్రతిపక్షాల నిరసనల మధ్య వాయిదా పడింది. సరిహద్దు ఘర్షణలపై చర్చించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాల నిరసనలు హోరెత్తించారు. దీంతో లోక్‌సభను స్పీకర్‌ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో సరిహద్దు సమస్యపై చర్చించాలని కోరుతూ ప్రతిపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశాయి.

Spread the love