సామాన్యుడిని విస్మరించిన బడ్జెట్‌

– పట్నం, సీఐటీయూ సెమినార్‌లో శ్రీకాంత్‌ మిశ్రా
హైదరాబాద్‌ : ఈ నెల ఒకటిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సామాన్యులను విస్మరించిందని పట్నం, సీఐటీయూ సంయుక్తంగా సోమవారం నిర్వహించిన సెమినార్‌లో వక్తలు తీవ్రంగా విమర్శించారు. వ్యవసాయరంగం, ఆహార సబ్సిడీ, గ్రామీణ ఉపాధి హామీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కార్మికవర్గానికి కేంద్ర బడ్జెట్‌లో కోతలు పెట్టటం దారుణమని సెమినార్‌లో పాల్గొన్న ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ మిశ్రా తెలిపారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలకు పరిష్కారం చూపలేదనీ అన్నారు. ఇది కార్పొరేట్‌ శక్తులకు అనుకూలమైన బడ్జెట్‌ అని మిశ్రా తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తిపెంచే ఎలాంటి చర్యలూ చేపట్టలేదని విమర్శిచారు. ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు డి పాపారావు మాట్లాడుతూ.. సామాన్య ప్రజల అభివృద్ధికి, వ్యవసాయ రంగానికి ఇచ్చే మొత్తం సబ్సిడీలు రూ.1.59 లక్షల కోట్లు కుదించి తన కార్పొరేట్‌ పక్షపాతాన్ని ప్రదర్శించిందనీ, ఇది ఆర్థిక అసమానతలను మరింత పెంచే బడ్జెట్‌ అన్నారు. ద్రవ్యలోటు దృష్టిలో పెట్టుకొని చేయటంవల్ల డిమాండ్‌ పెరగటానికి, ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఈ బడ్జెట్‌ ఉందని స్పష్టంచేశారు. ఈ సెమినార్‌కు డిజి నర్సింహారావు, పాలడుగు భాస్కర్‌ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.

Spread the love