నవతెలంగాణ-బంజారాహిల్స్
నిత్యం అనుక్షణం బిజీగా ఉండే జర్నలిస్టులు సిరిధాన్యాల వంటకాలు తినటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చునని పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలి పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్ హైదరాబాద్, రైతునేస్తం ఫౌండషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమాజిగూడలో పాత్రికేయులకు మంగళవారం సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహనా సదస్సు జరిగింది. కొర్రలు, అండు కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు చిరు ధాన్యాల్లో పుష్కలమైన ఫైబర్ ఉందని ఖాదర్ వలి వివరించారు. జర్నలిస్టులు తీవ్రమైన పని వత్తిడిలో మధుమేహానికి గురవుతున్నారని అయన ఆందోళన వ్యక్తం చేశారు. చిరు ధాన్యాల ఆహారం నిరంతరం తీసుకోవటం వల్ల మధుమేహం మటుమాయం చేయ వచ్చని ఖాదర్ వలి వెల్లడించారు. దీన్ని శాస్త్రీయంగా కూడా నిరూపించినట్టు అయన తెలిపారు. జర్నలి స్టులు ఈ చిరుధాన్యాల ఆహరం తీసుకోవటంతో తాము ఎక్కువకాలం ఆరోగ్యమంగా జీవించటంతో పాటు సమాజానికి సిరి ధాన్యాల విశిష్టత సమాజానికి చెప్పాలని ఖాదర్ వలి సూచించారు. చిరు ధాన్యాలు ఆరోగ్యాన్ని ప్రసాదించేవనీ, వాటిని 9 నెలల పాటు వాడితే వ్యాధులూ దూరం అవుతాయని పేర్కొన్నారు. అయితే కనీసం ఏడు గంటల పాటు నానబెట్టిన తర్వాత ఉడికించి తినాలని ఆయన సూచించారు. కేవలం అంబలే కాకుండా దోశలు, ఇడ్లీ తదితర అన్ని రూపాల్లోనూ చేసుకుని తినొచ్చన్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు, వరిగెలు చిరుధాన్యాలే అయితే అవి మేజర్ రకం కిందకు వస్తాయనీ, వీటిలో పీచు శాతం 3.6శాతం ఉంటే చిరుధాన్యాల్లో 8 నుంచి 12శాతం ఉంటుందన్నారు. అధిక పీచు ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా అది మన రక్తంలోకి చేరి ఆరోగ్యం ఇస్తుందన్నారు. రాగులతోనూ ఆరోగ్యం బాగుటుంది.. కానీ, రోగాలు బాగుకావన్నారు. కొర్రలు కనీనం 7 గంటలు నానబెట్టాలనీ, అపుడే జరీకరణ జరిగి వికసిస్తుందన్నారు. వాటితో చేసిన వంటకాన్ని 6 నెలల పిల్లల నుంచి పెద్ద వారంతా తొనొచ్చన్నారు. అయితే వీటిని కలపకుండా వేటికవే వండుకు తింటేనే శరీరానికి ఉపకరిస్తుందన్నారు. చిరు ధాన్యాలు తింటే గ్యాస్టిక్ర్ సమస్య వస్తుందనే అపోహ ఉందనీ, అంబలి తాగితే గ్యాస్టిక్ర్ సమస్య నయం అవుతుంది తప్ప పెరగదన్నారు. రోజుకు రెండు పిడికిళ్ల ధాన్యం ఆహారంగా సరిపోతుందన్నారు. రెండు గంటలకు ఒకసారి తినమనే సూచనలు పొరపాటనీ, ఆకలి అయినపుడు మాత్రమే తినాలని సూచించారు. ఒకపూట తినే వాడు యోగి, రెండు పూటలు తింటే బోగి, మూడు పూలలు తినేవాడు రోగి అని అభివర్ణిం చారు. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాలు మంచివే నని, అన్నీ తీసుకోవచ్చన్నారు. సిరిధాన్యాలు, పాకసిరి అనే రెండు పుస్తకాలను ఖాదర్ వలి,రైతు నేస్తం ఫౌండషన్ చైర్మన్ పద్మశ్రీ గ్రహీత డాక్టర్ యడవల్లి వెంకటేశ్వర రావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎల్.వేణుగో పాల నాయుడు, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రావు, సంయు క్త కార్యదర్శి చిలుకూరి హరి ప్రసాద్ ఆవిష్క రించారు. సిరిధాన్యాల పై జర్నలిస్టుల్లో మరింత అవగాహన కల్పించటానికి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామని డాక్టర్ వెంకటేశ్వర రావు ఈ సందర్భంగా చెప్పారు. 2023 మిల్లెట్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించడం జరిగిందనీ, మనకు తెలిసిన ఈ పరిజ్ఞానాన్ని పది మందికి పంచాలని సూచించారు. ఈ సదస్సులో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎల్.వేణుగోపాల నాయుడు, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రావు, సంయుక్త కార్యదర్శి చిలుకూరి హరి ప్రసాద్, సభ్యులు ఎ.పద్మావతి, బాపురావు, వసంతకుమార్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. సిరిధాన్యాల ఆహారం తీసుకోవటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనీ, ప్రకృతి సిద్దమైన కషాయాలు తీసుకుంటే రోగాల బారినుంచి బయటపడవచ్చని జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు ఖాదర్ వలి సమాధానాలు చెప్పారు.