బిల్లును ఆమోదించిన సెనెట్ భారత్, చైనాపై పెనుభారం
వాషింగ్టన్ : రష్యా పైన, భారత్, చైనా సహా దాని నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న ప్రధాన దేశాల పైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు ఉపక్రమించింది. దీనికి సంబంధించిన ‘లిండ్సే ఓ గ్రహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ -2026’ను సెనెట్ 86-11 ఓట్లతో ఆమోదించింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న ఐదు ప్రధాన దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై వంద శాతం సుంకాన్ని విధించేందుకు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. సెనెట్ ఆమోదం పొందిన ఈ బిల్లు ఈ నెల 31న సమావేశమయ్యే ప్రతినిధుల సభ ముందుకు వెళుతుంది. ప్రస్తుతం రష్యా నుంచి చమురు, గ్యాస్ను కొనుగోలు చేస్తున్న దేశాలలో చైనా, భారత్, అజర్బైజాన్, హంగరీ, స్లొవేకియా ప్రధానమైనవి. రష్యా అధ్య క్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలువురు నేతలు, అధికారులు, ఆర్థిక సంస్థలపై కూడా ఆంక్షలు విధించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.
కాగా ఇరాన్పై అమలులో ఉన్న ఆంక్షలను 2031 వరకూ కొనసాగించేందుకు సైతం ఈ బిల్లు వీలుకల్పిస్తోంది. ఇరాన్ ఇంధన రంగం లో పెట్టుబడులు పెట్టే కంపెనీలపై జరిమానాలు విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. బిల్లును ముందుకు తెచ్చిన రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రహమ్ ఈ నెల 11న మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బిల్లుకు ఆయన పేరును చేర్చారు. బిల్లుకు ప్రధాన పార్టీలు రెండూ మద్దతు తెలిపాయి. లిండ్సే గ్రహమ్ స్థానంలో సెనెట్లో నియమితురాలైన ఆయన సోదరి డార్లిన్ గ్రహమ్ మాట్లాడుతూ ‘రష్యా ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్న ప్రధాన దేశాలు ఇప్పుడు కీలకమైన నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అమెరికాతో వ్యాపారం చేయాలా లేక చౌకైన రష్యా ఇంధనాన్ని కొనాలా అనేది అవి నిర్ణయించుకోవాలి’ అని చెప్పారు.
రష్యా చమురు కొనుగోలుదారులపై100 శాతం సుంకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



