నవతెలంగాణ-జూబ్లీహిల్స్
హైదరాబాద్ యూసఫ్ గూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కార్ల గ్యారేజీలో మొత్తం 23 కార్లు దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసఫ్గూడలోని గణపతి కాంప్లెక్స్ వద్ద సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే ‘నాని కార్స్’ అనే గ్యారేజ్ ఉంది. మంగళవారం ఉదయం గ్యారేజ్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే 23 కార్లు, ఆఫీస్ ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఓ కారులోని బ్యాటరీ పేలడంతో మంటలు వ్యాపించినట్టు తెలిసింది.