– పోటీ పరీక్షలు రాయకుండా శాశ్వత డీబార్
– టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. లీకేజీతో సంబంధమున్న 37 మంది అభ్యర్థులపై వేటు వేసింది. పోటీ పరీక్షలు రాయకుండా శాశ్వతంగా డీబార్ చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో సంబంధమున్న ఆ 37 మంది అభ్యర్థులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ భవిష్యత్తులో నిర్వహించే పోటీ పరీక్షలకు అనుమతించ కూడదని కమిషన్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఆ 37 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సిట్ 44 మందిపై కేసు నమోదు చేయగా, వారిలో 43 మందిని అరెస్టు చేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నది. ఇంకోవైపు లీకేజీతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే టీఎస్పీఎస్సీకి పది పోస్టులను మంజూరు చేసింది. టీఎస్పీఎస్సీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా బిఎం సంతోష్ను, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా ఎన్ జగదీశ్వర్రెడ్డిని ప్రభుత్వం నియమించిన సంగతి విదితమే.
డీబార్ అయిన అభ్యర్థులు
1. పులిదిండి ప్రవీణ్కుమార్ 2. అట్ల రాజశేఖర్రెడ్డి 3. రేణుక రాథోడ్ 4. లావుడ్యావత్ డాక్యానాయక్ 5. కె రాజేశ్వర్, 6. కె నీలేష్ నాయక్ 7. పి గోపాల్ నాయక్ 8. కె శ్రీనివాస్ 9. కె రాజేందర్ నాయక్ 10. షమీమ్ 11. ఎన్ సురేష్ 12. డి రమేష్ కుమార్ 13. ఎ ప్రశాంత్రెడ్డి 14. టి రాజేందర కుమార్ 15. డి తిరుపతయ్య 16. సాన ప్రశాంత్ 17. వై సాయి లౌకిక్ 18. ఎం సాయి సుష్మిత 19. కోస్గి వెంకట జనార్ధన్ 20. కోస్గి మైబయ్య 21. కోస్గి రవి 22. కోస్గి భగవంత్ కుమార్ 23. కొంతమ్ మురళీధర్ రెడ్డి 24. ఆకుల మనోజ్ కుమార్ 25. ఆది సాయిబాబు 26. పొన్నం వరుణ్ కుమార్ 27. రమావత్ మహేష్ 28. ముడావత్ శివకుమార్ 29. దానంనేని రవి 30. గున్రెడ్డి క్రాంతి కుమార్రెడ్డి 31. కొంతమ్ శశిధర్రెడ్డి 32. అట్ల సుచిత్రరెడ్డి 33. జిపి పురేందర్ నూతన్ రాహుల్ కు మార్ 34. లావు దయ శాంతి 35. రమావత్ దత్తు 36. అజ్మీర పృథ్వీ రాజ్ 37. జాదవ్ రాజే శ్వర్.