బాసర ఆర్జీయూకేటీ వద్ద ఆందోళన

– విద్యార్థి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
– రాజకీయ పార్టీల నేతల డిమాండ్‌

నవతెలంగాణ-బాసర
నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీ వద్ద బుధవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేశారు. యూనివర్సిటీలో ఏడాది కాలంలో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడంపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర జన సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు సర్దార్‌ వినోద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నాయకులు ఆర్జీయూకేటీ ప్రధాన ద్వారం నుంచి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ ఆనంద్‌రావు పటేల్‌, ఇతర నాయ కులను ప్రధాన ద్వారం వద్ద పోలీ సులు అడ్డుకొని అరెస్టు చేశారు. యూనివర్సిటీలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించక పోవడం, సమస్యలపై తల్లి దండ్రులు యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసు కెళ్లినా పరిష్కారానికి మొగ్గు చూపడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అరవింద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో చదువుతున్న పేద ప్రజల బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటున్నా మంత్రులు, అధికారులు భద్రత చర్యలు తీసుకోవడంలో విఫలమ య్యారని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ ముధోల్‌ ఇన్‌చార్జి ఆనంద్‌రావు పటేల్‌ డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణకు కమిటీల పేరుతో కాలయాపన చేయడం తప్ప సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థి మృతి నేపథ్యంలో ఆర్జీయూకేటీ ప్రధాన ద్వారం వద్ద పోలీసు బలగాలను భారీగా మోహరించారు. తనిఖీలు చేసిన తర్వాతే యూనివర్సిటీలోకి అనుమతిస్తున్నారు.
బాసర త్రిపుల్‌ఐటీలో ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరపాలి
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బాసర త్రిపుల్‌ ఐటీలో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపించాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ ఏడాది బబ్లూ ఆత్మహత్యతో ఇది నాలుగోదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు చనిపోతున్నా విశ్వవిద్యాలయ అధికారులు, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. త్రిపుల్‌ ఐటీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించి సమగ్రమైన విచారణ జపించాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ నేతృత్వంలో ఐద్వా అధ్యక్షురాలు పికె శ్రీమతి, ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, తదితరుల బృందం మణిపూర్‌లో పర్యటించింది. కాంగ్‌పోక్సీ జిల్లాలో పలువురు బాధిత కుటుంబ సభ్యులను బృంద సభ్యులు పరామర్శించారు. హింసాకాండలో తన ఏడేండ్ల కుమారుడిని, భార్య, ఆమె స్నేహితురాలిని కోల్పోయిన జాషువా అనే వ్యక్తిని కూడా వారు పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. లైంగిక దాడి, అనంతరం హత్యకు గురైన ఇద్దరు యువతుల తల్లిదండ్రులను కూడా ఐద్వా ప్రతినిధులు కలిసి.. ఓదార్చారు.

Spread the love