చెప్పిందొకటి..చేస్తున్నదొకటి !

– శ్రీరాంసాగర్‌ రెండోదశపై శీతకన్ను
– 4.40 లక్షల ఎకరాల
– ఆయకట్టు స్థీరీకరణ పెండింగ్‌
– 1984 నుంచీ నిర్లక్ష్యమే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిస్తున్న గులాబీ సర్కారు ఉమ్మడి రాష్ట్రంలోని పథకాలపై శీతకన్నేసింది. ఇచ్చిన హామీని పట్టించుకోవడం లేదు. ఆ ప్రాజెక్టుల పట్ల తీవ్ర అలసత్వం, నిర్లక్ష్యం కనిపిస్తున్నది. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 4.40 లక్షల ఎకరాలకు సాగునీరందించే శ్రీరాంసాగర్‌(ఎస్‌ఆర్‌ఎస్పీ) ప్రాజెక్టు రెండో దశ పనులు ఆ కోవలోకే వస్తాయి. రాష్ట్రంలో 18 భారీ, 31 మధ్యతరహా ప్రాజెక్టులున్నాయి. కాగా మధ్యతరహా ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశం ఉన్నా, ఆతరహా కార్యాచరణే లేదు.
మూడు జిల్లాల్లో స్థీరీకరణ
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రెండో దశ పనులు పూర్తిచేస్తే ఖమ్మం జిల్లాలోని 68,914 ఎకరాలు, వరంగల్‌లోని 1,13,575 ఎకరాలు, నల్లగొండ జిల్లాలోని 2,57,508 ఎకరాల ఆయకట్టు స్థీరీకరణ జరుగుతుంది. తద్వారా ఆ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయి. ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ పనులు పూర్తయినా, నీటిని పంపిణీ చేసే ఉపకాలువల పనులు ఇంకా ఆలస్యమవుతూనే ఉన్నాయి. ఈ రెండో దశకు 40 టీఎంసీల నీరు అవసరం. ఈ నీరు శ్రీరాంసాగర్‌ కాకతీయ కాలువ ద్వారా దిగువకు రావడం గత దశాబ్ధకాలంలో సాధ్యం కాలేదు. కాకతీయ కాలువకు 234వ కిలోమీటర్‌ వరకే నీరు వస్తున్నది. మొదటి దశలోని 234-284 కిలోమీటర్లకు కూడా నీరందడంలేదు. పై 50 కిలోమీటర్లల్లో మోరంచ, తీగలవేని, వెన్నవరం కాలువలకు కూడా నీరు రావడం లేదు. 284 నుంచి 343 కిలోమీటర్ల వరకు గత రెండు దశాబ్దాలుగా నీళ్లు రాలేదు. కాళేశ్వరం ద్వారా స్థీరీకరిస్తామని చెప్పినా, అమలుకాలేదు. కాలువలు పూర్తయినా ఇప్పుడవి శిథిలావస్థకు చేరుకున్నాయి. కాకతీయ కాలువ మొదటి దశ 50 కీలోమీటర్లతోపాటు రెండో దశకు 70 టీఎంసీల నీరు కావాల్సి ఉంటుంది. ఈ నీటిని దేవాదుల లిఫ్ట్‌ ద్వారా గానీ, లేదా కాంతాలపల్లి ఎత్తిపోతల ద్వారాగానీ సరఫరా చేయడానికి వీలుంది. ఇదొక్కటే మార్గం.
మూడుసార్లు శంకుస్థాపనలు
ఈ ప్రాజెక్టు రెండోదశకు మూడుసార్లు శంకుస్థాపనలు జరిగాయి. అప్పటి ప్రధాని కి.శే ఇందిరాగాంధీతోపాటు అప్పటి ముఖ్యమంత్రి కీ.శే ఎన్టీఆర్‌తో కలిసి 1984, మే నాలుగో తేదీన శంకుస్థాపన చేశారు. కాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం 1996, మార్చి ఆరున ఒకసారి, 2002 మే తొమ్మిదిన రెండోసారి శంకుస్థాపన చే
శారు. తొలుత ఈ ప్రాజెక్టు వ్యయం సాగునీటి పారుదల, ఆయకట్టు శాఖ రూ. 1258 కోట్లుగా నిర్ధారించింది. ఆ తర్వాత పెరుగుతూ వస్తున్నన్నది. ప్రధాన ఉపకాలువలు డీబీఎం 30, డీబీఎం 40, డీబీఎం 48 కాలువలు తవ్వినా లైనింగ్‌ చేయలేదు. చేసినవీ కూలిపోయాయి. కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కయి నిధులు కాజేశారంటూ దాదాపు 12 మంది అసిస్టెంట్‌ ఇంజినీర్ల(ఏఈ)పై సస్పెన్షన్‌ వేటు వేసి చేతులు దులుపుకున్నారు.
1984 నుంచీ నిర్లక్ష్యమే
ఖమ్మం జిల్లా 68,914 ఎకరాలకు నీరిచ్చేందుకు పాలేరు నుంచి భక్తరామదాసు లిఫ్ట్‌పెట్టారు. పాలేరు ఆయకట్టుకు కృష్ణానదీ నుంచి ఇస్తున్నారు. కానీ, భక్తరామదాసు లిఫ్ట్‌ ద్వారా ఖమ్మం జిల్లాలోని గోదావరి ఆయకట్టుకు మళ్లించారు. గోదావరిలో సరిపోను నీళ్లు ఉన్నాయి. కాకతీయ కాలువ ద్వారా ఇచ్చే అవకాశం ఉంది. కృష్ణాకు లింకుపెట్టి ఖమ్మంలో పబ్బంగడిపారు. రెండోదశకు ఇప్పటికీ నీటి కేటాయింపుల గ్యారంటీ లేదు. కరీంనగర్‌, వరంగల్‌ సరిహద్దు వరకు మొదటిదశ శ్రీరాంసాగర్‌ నీళ్లు వస్తున్నాయి. కిందకు వదలడంతో వరంగల్‌ నగరానికి తాగునీటిని అందిస్తున్నారు. వడ్డేపల్లి, భద్రకాళి చెరువును నింపుతున్నారు. దేవాదుల ప్రాజెక్టుతో ధర్మసాగర్‌ చెరువు నీటిసమస్య తీరుతున్నది. కానీ రెండో దశకు నీళ్లీవ్వడంపై 1984 నుంచి దృష్టిపెట్టలేదు.
నీటి గ్యారంటీ ఏదీ ?
శ్రీరాంసాగర్‌ రెండో దశకు నీటి గ్యారంటీ లేదు. పంపిణీచేసే కాలువల పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అదనపు నిధులు కావాల్సి ఉంది. మరో రూ. 1000 నుంచి రూ. 1200 కోట్లు అవసరం. ప్రస్తుత ప్రభుత్వం వీటిని కేటాయించాల్సి ఉంది. అది పూర్తిచేయకుండానే వరదనీటితో నీళ్లు ఇస్తామని చెప్పడం సరికాదని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. మొదటి దశ ప్రాంతంలో రెండో పంట నీళ్లను ఆపి, శ్రీరాంసాగర్‌ రెండో దశ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే డిమాండ్‌ ముందుకొచ్చింది. గత ప్రభుత్వాలు గోదావరి నదీపై ఉన్న కాంతాలపల్లి, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా కనెక్షన్లు ఇచ్చి కాకతీయ కాలువకు నీళ్లు ఇస్తామన్నా చెప్పి, దాన్నీ పట్టించుకోలేదు. ఇప్పుడు కాంతాలపల్లిని ఎత్తేసి తుపాకులగూడెం చేపట్టారు. దీంతోనైనా కూడా శ్రీరాంసాగర్‌ రెండో దశ స్థీరీకరణకు గోదావరి నీళ్లను లిఫ్ట్‌ ద్వారా ఇస్తామన్న సర్కారు హామీనీ నెరవేర్చాలనే డిమాండ్‌ వస్తున్నది.

Spread the love