– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సరఫరా మెరుగుదల కోసం రూ.30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 5 కొత్త ట్రాన్స్ఫార్మర్లను స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాన్స్ఫార్మర్లను చార్జ్ చేసి ప్రజలకు అంకితం చేశారు.
పట్టణంలోని విద్యుత్ లోపాలను దృష్టిలో ఉంచుకుని మూడు 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు, రెండు 100 కేవీఏ అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. రామాలయం వీధి, జంగారెడ్డిగూడెం రోడ్డులోని బీసీ హాస్టల్ సమీపం, వినాయకపురం రోడ్డులోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయగా, బీఎస్ఆర్ నగర్, ఏఎస్ఆర్ నగర్లలో 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జూపల్లి శశికల, వైస్ చైర్పర్సన్ జూపల్లి రమేశ్బాబు, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, విద్యుత్ శాఖ ఏడీఈ బి. వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో నెలకొన్న లో-వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందనున్నట్లు అధికారులు తెలిపారు.



