తెలుగు సినిమా పరిశ్రమ 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గతంలో వజ్రోత్సవం చేసినట్టు ఈసారి ‘నవతిహి ఉత్సవం’ చేయబోతున్నారు. త్వరలో మలేషియాలో నవతిహి పేరిట చేయబోయే ఈ ఈవెంట్ గురించి ప్రకటించడానికి శనివారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.
ఇందులో ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ, ఈసీ మెంబర్స్తోపాటు పలువురు మలేషియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హోస్ట్గా నటి మధుమిత, శివబాలాజి వ్యవహరించారు. విష్ణు మంచు మాట్లాడుతూ,’మలేషియా నుంచి ఇక్కడికి వచ్చిన కమల్ నాథ్కి, టూరిజం డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు. రెండేళ్ల క్రితం 90 ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్ చేయాలని నిర్ణయించుకున్నాం. తెలుగు సినీ పరిశ్రమ మొదలైన దగ్గర్నుంచి ఎంతోమంది నటీనటులను గుర్తుచేసుకుంటూ ఈ ఈవెంట్ని గ్రాండ్గా, చాలా సక్సెస్ఫుల్గా మలేషియా గవర్నమెంట్తో చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా ‘మా’ తరపున బిగ్గెస్ట్ సినిమా ఈవెంట్ను జులైలో మలేషియాలో చేయబోతున్నాం. సినీ పరిశ్రమ పెద్ధలతో మాట్లాడి డేట్ను ఎనౌన్స్ చేస్తాం. దీని కోసమై మూడు రోజులు సినిమా ఇండిస్టీకి సెలవులు ఇవ్వాలని ఛాంబర్ని కోరాం. ఇప్పుడు తెలుగు సినిమాకు గోల్డెన్ ఎరా నడుస్తోంది. తెలుగు నటీనటులుగా మేమంతా గర్విస్తున్నాం. తెలుగు సినిమా ఘన కీర్తిని తెలిపేలా ఈ నవతిహి ఉత్సవం చేయబోతున్నాం. అందుకే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవటం కరెక్ట్ టైమ్ అని భావిస్తున్నాం. మలేషియా గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘మా’లో దాదాపు 800కి పైగా ఆర్టిస్టులు ఉన్నారు. కానీ అందులో కొంతమందే బాగా సెటిల్ అయినవాళ్లు. మిగిలిన వాళ్లకు మేము అండగా నిలబడటానికి ఈ ఫండ్ రైజింగ్ చేస్తున్నాము. ఇప్పటికే మేము చేస్తున్న మెడికల్ ఇన్స్యూరెన్స్ చాలా మందికి సపోర్ట్గా నిలిచింది’ అని తెలిపారు.