12 గంటల షిఫ్ట్పై నిరసనలు అడ్డుకునేందుకే : కేఐటీయూ
తక్షణమే విడుదల చేయండి : సీపీఐ(ఎం) డిమాండ్
బెంగళూరు : ఐటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రచారం చేస్తున్న కర్ణాటక రాష్ట్ర ఐటి ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 10 గంటల షిఫ్ట్ను 12 గంటలకు పెంచడాన్ని నిరసిస్తూ డిసెంబర్ 21న నిరసనలకు కెఐటియు పిలుపునిచ్చింది. నిరసన కార్యక్రమాన్ని ప్రారంభంలోనే అడ్డుకోవాలనే ఉద్దేశంతో కేఐటీయూ ముఖ్య నాయకులు చిత్ర భాను, ఎ. సుహాస్లను శనివారం రాత్రి బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకూ వారి సమాచారాన్ని తెలపలేదు. వారిని కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదు. నిరసనలను అడ్డుకునేందుకు నేతలను అరెస్టు చేశారని కేఐటీయూ విమర్శించింది. ఐటీ నాయకుల అరెస్టును సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు సోషల్ మాద్యమం ఎక్స్లో ఆదివారం పోస్ట్ చేసింది.
నెలల తరబడి ఆందోళన
బెంగళూరులో ఐటీ, ఐటీఎస్, బీపీఓ రంగాల్లో రోజువారీ పని గంటలను 10 నుంచి 12 గంటల వరకు పెంచారు. దీనిని వ్యతిరేకిస్తూ గత ఐదు నెలల నుంచి ఐటీ ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 21వ తేదీన శాంతియుత ఆందోళనకు కేఐటీయూ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం విజయవంతానికి కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఆందోళనలను అడ్డుకునేందుకే నాయకులను అరెస్టు చేశారని కేఐటీయూ విమర్శించింది. నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
ప్రజల గొంతు నిలువరించలేరు : సీపీఐ(ఎం)
ప్రభుత్వం అణచివేత చర్యల ద్వారా ప్రజల గొంతును నిలువరించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోకుండా నిర్బంధించడం సరికాదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ తెలిపింది. అప్రజాస్వామికంగా కర్నాటక ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించింది. అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.



