ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ డిమాండ్
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ లో కాలం చెల్లిన పాత ఏజెన్సీల టెండర్లను రద్దుచేసి సానిటేషన్, సెక్యూరిటీ గార్డు కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అందే విధంగా నూతన టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నూతన టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసి కార్మికుల వేతనాలు పెంచాలని మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా హాస్పిటల్ లో ధర్నా నిర్వహించి సూపరింటెండెంట్ పాండు నాయక్ కి కార్మికులతో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఐహెచ్ఎఫ్ఎంఎస్) ద్వారా పారిశుద్ధ్యం, భద్రత, రోగి సంరక్షణ నిర్వహణ కోసం మూడు సంవత్సరాల కాల వ్యవధితో రాష్ట్రవ్యాప్తంగా టెండర్ నోటిఫికేషన్ తో ఏజెన్సీలను ఎంపిక చేసే విధానం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఏజెన్సీలు 2022లో ఎంపిక చేశారని వాటి కాల పరిమితి ముగిసి నెలలు గడుస్తున్న కొత్త టెండర్ల ప్రక్రియ ప్రారంభించలేదన్నారు. గత ప్రభుత్వం అప్పటి టెండర్ ముసాయిదలో కార్మికులకు నష్టదాయకమైన అంశాలను జోడించడం చేత ఏజెన్సీ కాంట్రాక్టర్లకు దోచుకుని వెసులుబాటు కలిగిందని అన్నారు. కనుక టెండర్ గైడ్లైన్స్ లో కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 అందే విధంగా పండగ, జాతీయ, సెలవులు పొందుపరుస్తూ న్యూ టెండర్ పాలసీని విడుదల చేయాలని ఇమ్రాన్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు గుండు వాణి, నీలం నరసింహ, సోమ నరసయ్య, బట్టుపల్లి లావణ్య, శారదా లలిత, సులోచన, భారతమ్మ, హేమలత, విజయలక్ష్మి, సురేఖ, శేఖర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.


