ఫౌండర్ ప్యానల్
మహేష్ బ్యాంక్ను నైతికతతో పునరుద్ధరించే సమయం వచ్చింది: కైలాష్ నారాయణ
సభ్యహక్కుల రక్షణ, నిష్పాక్షిక ఎన్నికల కోసం 14 మంది వ్యవస్థాపక ప్యానెల్కు ఐక్య మద్దతు కోరిన నేతలు
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు 2025 ప్రచారంలో భాగంగా, ఫౌండర్ ప్యానల్ చైర్మన్ అభ్యర్థి శ్రీ భాంగడియా కైలాష్ నారాయణ నేతృత్వంలో బేగం బజార్లోని మహేశ్వరి భవన్లో సమావేశం నిర్వహించారు. యువర్ బ్యాంక్ అనే థీమ్తో జరిగిన ఈ సభకు సభ్యులు, షేర్హోల్డర్లు, వ్యాపార వర్గాలు మహేశ్ బ్యాంక్ మద్దతుదారులు భారీ సంఖ్యలో హాజరై విశేష స్పందనను వ్యక్తం చేశారు. బ్యాంక్ భవిష్యత్తు కోసం పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థ అవసరమనే మార్మోగే సందేశం ఇచ్చారు.
సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమినెంట్ సోషల్ వర్కర్ మరియు ఎగ్జోరియల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఎండి భాగవతీదేవి బాల్ద్వా, సహకార బ్యాంకింగ్లో నమ్మకం అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. “బ్యాంక్ నమ్మకంతో నిలబడితేనే ప్రజలు నిలబడతారు. మహేశ్ బ్యాంక్ భవిష్యత్తు నిజాయితీ, బాధ్యత, పారదర్శకత వంటి మూడు ప్రధాన స్థంభాలపై నిలవాలి” అని ఆమె పేర్కొన్నారు. ఫౌండర్ ప్యానల్ ప్రజల హితాన్ని ముందుంచే నాయకత్వాన్ని ప్రతిబింబిస్తోందని, సభ్యులు బాధ్యతాయుతంగా ఓటు వేసి నైతిక నాయకత్వాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. భాంగడియా కైలాష్ నారాయణ, మహేశ్ బ్యాంక్పై సభ్యుల నమ్మకాన్ని పునరుద్ధరించడం తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.
“బ్యాంక్ సభ్యులదే. దీనిని పారదర్శకత, సేవా దృక్పథం, నైతిక విలువల ఆధారంగా పునర్నిర్మించాలి” అని ఆయన తెలిపారు. గతంలో చోటుచేసుకున్న అవకతవకలు తిరిగి జరగకుండా కఠినమైన పాలనా వ్యవస్థ అవసరమని చెప్పారు. ఫౌండర్ ప్యానెల్లోని 12 మంది జనరల్ కేటగిరీ అభ్యర్థులు మరియు 2 మంది మహిళా కేటగిరీ అభ్యర్థులు—మొత్తం 14 మంది అభ్యర్థులందరికీ వేర్వేరు బ్యాలెట్ల ద్వారా ఓటు వేయాలని సభ్యులను కోరారు.ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు డిసెంబర్ ఏడో తేదీన జరగనున్నాయని తెలిపారు.
పోలింగ్ కేంద్రాలు నంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (నుమాయిష్ మైదానం)లోని సరోజిని నాయుడు వనితా మహావిద్యాలయం మరియు కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ఫర్ విమెన్. హైదరాబాద్ వెలుపల ఉన్న సభ్యులు తమ సమీప శాఖలైన ఖమ్మం, కరీంనగర్, వరంగల్, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, ముంబై, భిల్వారా, జైపూర్ శాఖల్లో ఓటు వేయవచ్చు. సభ్యులు ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి అన్నారు. పోలింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు అన్నారు.
బ్యాంక్కు సంబంధించిన నియంత్రణ సంస్థల విచారణ వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ఈడి), హైదరాబాద్ జోనల్ ఆఫీస్ పీఎంఎల్ఏ-2002 చట్టం కింద ₹1.1 కోట్లు విలువ చేసే రెండు ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఇవి రంగారెడ్డి జిల్లా అడిబట్ల గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని ఆస్తులు కాగా, ఇవి బ్యాంక్ మాజీ ఎండి సీఈవో ఉమేష్ చంద్ ఆసావా కుమారుడు రోహిత్ ఆసావా పేరిట ఉన్నట్లు ఈడివెల్లడించింది.
ఈ కేసులో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన రెండు ఎఫ్ ఐ ఆర్ ల ఆధారంగా విచారణ ప్రారంభమైంది. మాజీ ఛైర్మన్ రమేష్ కుమార్ బంగ్, మాజీ ఎండి సీఈవో ఉమేష్ చంద్ ఆసావా, మాజీ సీనియర్ వైస్ చైర్మన్ పురుషోత్తమదాస్ మంధానాలపై అర్హతలేని వ్యక్తులకు రుణాలు మంజూరు చేయడం, నకిలీ/లేనిపోని భూములను కాలేటరల్గా స్వీకరించడం, రుణాలపై అక్రమ కమిషన్లు తీసుకోవడం వంటి ఆరోపణలు ఉన్నాయని ఈడిపేర్కొంది అన్నారు.ఈసమావేశంలో సభ్యుల హితసాధన, బ్యాంక్పై నమ్మకం పునరుద్ధరణ మరియు నైతిక పరిపాలన కోసం తాము కట్టుబడి ఉన్నామని ఫౌండర్ ప్యానల్ నేతలు పునరుద్ఘాటించారు.



